కరోనా నేపథ్యంలో ప్రతిఒక్కరి జీవన విధానంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండో దశలో వైరస్ విజృంభిస్తుండటంతో ఇప్పటికే చాలా మంది ఇంటికే పరిమితమయ్యాయి. ప్రైవేట్, ఐటీ సంస్థలన్నీ వర్క్ ఫ్రం హోంకు అనుమతివ్వడంతో ఇంట్లోనే ఉండి పలువురు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక గత సంవత్సరం నుంచి పాఠశాలలూ తెరుచుకోకపోవడంతో విద్యార్థులూ ‘ఆన్లైన్’లో చదువుతున్నారు. పనిలో పనిగా ఇంటి పట్టునే ఉంటున్న అమ్మకు సాయం చేస్తున్నారు. వంటింటి పనుల్లో భాగమవుతున్నారు. ఇది కూడా పని విద్యలో భాగమేనని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఎలాంటి నామోషీ లేకుండా ఇంటి పనుల్లో సాయం చేయడం మంచి పరిణమమేనని అంటున్నారు.
స్కూలు విద్యార్థులు అమ్మకు తోడవుతున్నారు. ఇంట్లో చిన్న పనులు చేస్తున్నారు. కూరగాయలు కోయడం, వంటలు చేయడం, బట్టలు ఉతకడం, ఇంటిని శుభ్రం చేయడం లాంటి పనులు నేర్చుకుంటున్నారు. ముఖ్యంగా ఎనిమిది నుంచి పదిహేను ఏండ్ల పిల్లలు ఈ పనులు చేస్తున్నారు. శ్రమ విలువ తెలుసుకుంటున్నారు. ఇది ఈ తరం పిల్లల్లోని నూతన ఆలోచనలకు అద్దం పడుతుందని.. భవిష్యత్లో మంచి స్థానానికి చేరడానికి ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
చదువులకే పరిమితం కాకుండా స్కూలు విద్యార్థులకు ‘విలువలు- జీవన నైపుణ్యాలు’ నేర్పించి వారిని అన్ని విధాలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. వీటిని బోధనేతర పాఠ్యాంశాలుగా రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధన మండలి(ఎస్సీఈఆర్టీ) నిర్ణయించింది. ఈ మేరకు కరదీపికను విడుదల చేసింది. మూడు నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ ‘విలువలు-జీవన నైపుణ్యాల’పై తప్పక బోధించాలని సూచించింది. దీంతో కొన్ని స్కూళ్లు ‘పని విద్య’పై పాఠాలు చెబుతున్నాయి. అయితే ప్రాక్టికల్స్ మాత్రం చూపించడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి.
1)పౌష్టికాహారం 2) ఆరోగ్య విద్య 2) జనాభా విద్య 4) సాంస్కృతిక విద్య- వినోదం 5) సామాజిక అంశాలపై అవగాహన- స్పందన 6) సమాచారం-డాక్యుమెంటేషన్ 7) వస్తువులు- నమూనాల తయారీ 8) గృహ యాజమాన్యం 9) వినియోగ దారుల విజ్ఞానం 10) పర్యావరణ విద్య ఉన్నాయి. అయితే వీటిలో ఉపాధ్యాయుల విచక్షణకు అనుగుణంగా పిల్లలకు బోధించాల్సి ఉంది.
కరోనా నేపథ్యంలో ఇంట్లో ఉంటున్న పిల్లలు ఇంటి పనులు నేర్చుకుంటున్నారు. కూరగాయలు కోయడం.. వంట వండటం లాంటి పనులను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. వీటికి ఎందరో ఫిదా అవుతున్నారు. అయితే విద్యాశాఖ కూడా ఆన్లైన్ ఫ్లాట్ఫాంల ద్వారా విద్యార్థులందరికీ విజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎస్సీఈఆర్టీకి చెందిన సబ్జెక్టు నిపుణులు సువర్ణావినాయక్ అభిప్రాయపడ్డారు. పిల్లలకు ‘పని విద్య’ నేర్పడం ఎంతో మంచిదంటున్నారు. పని విద్యకు సబంధించిన పూర్తిస్థాయి సిలబస్ను ఎస్సీసీఆర్టీ వైబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉందని వివరించారు.