రకరకాల కారణాలను సాకుగా చూపుతూ కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను నగర రోడ్లపై వదిలేస్తున్నారు. పసివాళ్లన్న కనికరం లేకుండా కండ్లు తెరవక ముందే చిన్నారులను చెత్త కుండీల పాల్జేస్తున్నారు. అలాంటి వారిని ప్రభుత్వ అధికారులు అక్కున చేర్చుకుంటున్నారు. శిశు విహార్ కేంద్రాలకు తరలించి ఆలనాపాలనా చూసుకుంటున్నారు. అంతేకాక ఆప్యాయతను పంచుతున్నారు. అంతే కాదు కొవిడ్ నేపథ్యంలో శిశు విహార్ కేంద్రాల్లోని చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. వైరస్ బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 60 శిశు విహార్ కేంద్రాలు ఉన్నాయి. అందులో సుమారు 2400 మంది చిన్నారులు ఆశ్రయం పొందుతున్నారు. కొవిడ్ నేపథ్యంలో వారు ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా జిల్లా సంక్షేమ శాఖ అధికారులు అన్ని చర్యలను చేపట్టారు.
సాధారణంగా కొందరు తమ పిల్లల జన్మదిన, వివాహ తదితర ప్రత్యేకమైన రోజులను శిశు విహార్లోని చిన్నారులతో కలిసి జరుపుకోవడానికి ఇష్టపడతారు. అయితే, ప్రస్తుతం చిన్నారుల ఆరోగ్యం దృష్ట్యా బయటి వ్యక్తులను ఎవరినీ శిశు విహార్ కేంద్రాల్లోకి అనుమతించడం లేదు. ఓ వేళ అనుమతించినా అధికారులు థర్మల్ స్క్రీనింగ్, మాస్కులు లేనిదే లోనికి అడుగుపెట్టనివ్వడం లేదు. ఇలా అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు పాటిస్తున్నారు.
శిశు విహార్ కేంద్రాల్లో కొవిడ్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. బయటి వ్యక్తులను ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. సిబ్బందికి సైతం ఇప్పటికే కొవిడ్ టెస్టులు చేయించాం. త్వరలోనే వారికి వ్యాక్సిన్ వేయించాలని నిర్ణయించారు. రెండు మూడు రోజుల్లో ఆ ప్రక్రియను పూర్తి చేస్తాం. చిన్నారులకు సైతం క్రమం తప్పకుండా వారికి ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తున్నాం. – అక్కేశ్వరరావు, హైదరాబాద్ జిల్లా సంక్షేమాధికారి