మియాపూర్ , సెప్టెంబర్ 13 : కనిపించకుండాపోయిన 13 నెలల బాలిక అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధి ఓంకార్నగర్లోని గుడిసెలో నివాసముండే రంగస్వామి, సుమలత దంపతుల కూతురు సోనీ ఆదివారం సాయంత్రం తోటి పిల్లలతో ఇంటి సమీపంలో ఆడుకుంటూ..అదృశ్యమైంది. కూతురు ఆచూకీ కోసం తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. ఈ క్రమంలో 13 ఏండ్ల బాలుడు చిన్నారిని అపహరించాడని స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. దీంతో తమ కూతురు కిడ్నాప్ అయిందని వారు మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, అదృశ్యం కేసు నమోదు చేశారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. విచారణ చేపట్టడంతో పాటు సీసీ కెమెరాలను పరిశీలించారు.
సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో చిన్నారి మృతదేహం ఇంటికి సమీపంలో లభ్యమైనట్లు కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ వైద్యశాలకు తరలించారు. అయితే చిన్నారి ఒంటిపై ఎటువంటి గాయాలైన ఆనవాళ్లు లేవని, కడుపు, ముక్కు, చెవుల నిండా నీరు నిండి ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. ఒకవేళ చిన్నారి ఆడుకుంటూ.. వెళ్లి నీటి గుంతలో పడి ఉంటే మృతదేహం అక్కడే ఉండాల్సి ఉండగా, అందుకు భిన్నంగా గుడిసె ముందు విగతజీవిగా పడి ఉన్నది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిన్నారిని ఎవరైనా హత్య చేసి మృతదేహాన్ని ఇంటి ముందు పడేసి వెళ్లారా? ఇంకేమైనా జరిగిందా అనే కోణంలో విచారిస్తున్నారు.