హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ) : సీఎంఎస్టీఈ (చీఫ్ మినిస్టర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్)తో గిరిజన యువత పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారని గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ అన్నారు. శుక్రవారం శేరిలింగంపల్లిలోని నల్లగండ్లలో గ్రీన్ బ్లిస్ స్టోర్ను ఆమె ప్రారంభించారు. సీఎంఎస్టీఈ పథకం కింద విస్లావత్ దశరథ్కు రూ. 60 లక్షల యూనిట్ను మంజూరు చేశామన్నారు. దీంతో వ్యాపారవేత్తగా ఎదిగిన దశరథ్ మరో 10 మందికి ఉపాధి కల్పించారని తెలిపారు. మూడేండ్ల నుంచి ఏడాదికి 100 మంది చొప్పున పారిశ్రామికవేత్తలుగా మారాలనుకునే విద్యావంతులను ఎంపిక చేసి వారికి వ్యాపార రంగంలో మెళకువలు నేర్పించి తీర్చిదిద్దుతున్నామని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ జనరల్ మేనేజర్ కుంజా శంకర్రావు, స్టేట్ మిషన్ మేనేజర్ ఎం.లక్ష్మీప్రసాద్, జాయింట్ డైరెక్టర్ కల్యాణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.