బంజారాహిల్స్,సెప్టెంబర్ 8 : ఏడేండ్లుగా ప్రేమ పేరుతో యువతిని నమ్మించడంతో పాటు పెండ్లి చేసుకుంటానని లోబర్చుకుని మోసం చేసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నెం 11లోని సింగాడకుంటలో నివాసం ఉంటున్న సీహెచ్.గౌతమ్(28) ఐబీఎం సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తుంటాడు.
అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి(27) ఓ నిర్మాణ సంస్థలో రిసెప్షనిస్ట్గా పని చేస్తుంటుంది. ఏడేండ్లుగా ప్రేమిస్తున్నానని యువతిని నమ్మించిన గౌతమ్ పెండ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా లోబర్చుకున్నాడు. పలు కారణాలతో పెండ్లిని వాయిదా వేసుకుంటూ వచ్చిన గౌతమ్ మూడునెలల క్రితం మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.
అప్పటినుంచి యువతికి కనిపించకుండా ముఖం చాటేశాడు. రెండ్రోజుల క్రితం అతడు ఇంటికి రాగా తనకు అన్యాయం ఎందుకు చేశావంటూ ప్రశ్నించినా సమాధానం ఇవ్వకపోగా దురుసుగా ప్రవర్తించాడు. దాంతో తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు బుధవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.