కొండాపూర్, సెప్టెంబర్ 18 : కాలేజీలో సీటు ఇప్పిస్తానంటూ అమ్మాయిని నమ్మించి మోసానికి పాల్పడిన వ్యక్తిని చందానగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ క్యాస్ట్రో తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా మహబూబాబాద్కు చెందిన సందీప్కుమార్ వేమిశెట్టి అలియాస్ అభినవ్ కుమార్ ఇంటర్మీడియట్ చదువుకుని బతుకుదెరువు నిమిత్తం ఆటో నడుపుతున్నాడు. కాగా అమాయకపు అమ్మాయిలకు ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుంటూ వారిని మోసం చేయడంతో పాటు డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఇదే క్రమంలో చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని అమ్మాయిని ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుని చాటింగ్ చేయడంతో పాటు పెళ్లి చేసుకుంటానని నమ్మించి న్యూడ్ ఫొటోలను తీసుకున్నాడు.
ఇదే క్రమంలో అమ్మాయికి ఓ కళాశాలలో ఎన్ఆర్ఐ కోటాలో బిఫార్మసీ సీటు ఇప్పిస్తానంటూ రూ.46వేలను చనిపోయిన అన్న పేరుతో ఉన్న ఫోన్ నంబర్కు గూగుల్ పే చేయించుకున్నాడు. అమ్మాయి పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో ఆమెతో పాటు కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు తన వద్ద ఉన్న ఫొటోలతో బెదిరింపులకు పాల్పడ్డాడు. బీఫార్మసీ సీటు కోసం తీసుకున్న డబ్బులు సైతం ఇచ్చేదిలేదంటూ బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సందీప్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు క్యాస్ట్రో తెలిపారు. సందీప్కుమార్పై ఇదివరకే సైబరాబాద్, ఎల్బీనగర్, ఆంధ్రప్రదేశ్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదైనట్లు తెలిపారు.