మేడ్చల్ మల్కాజ్గిరి : ఘట్కేసర్ వద్ద ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఓ బాలిక మృతదేహం శనివారం ఉదయం లభ్యమైంది. కాలిన గాయాలతో మృతి చెందిన బాలిక మృతదేహాన్ని స్థానికులు గుర్తించి ఘట్కేసర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే శుక్రవారం రాత్రి బాలిక స్రవంతి తన తల్లితో గొడవ పడినట్లు తెలుస్తోంది.
అదే రోజు రాత్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన బాలిక.. ఇంటికి గడియపెట్టి వెళ్లిపోయింది. శనివారం ఉదయం ఓఆర్ఆర్ పక్కన బాలిక మృతదేహం లభ్యమైంది. బాలిక డెడ్బాడీ వద్ద లభ్యమైన ఫోన్ ఆధారంగా ఆమె తండ్రి విష్ణు అని పోలీసులు తేల్చారు. వీరు స్థానికంగా ఉంటున్న రాజీవ్ గృహ కల్పలో నివాసముంటున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. బాలిక ఇటీవలే పదో తరగతి పూర్తి చేసింది. బాలికను హత్య చేశారా? లేక ఆత్మహత్య చేసుకుందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.