చార్మినార్ : నగరానికి అంతర్జాతీయ ఐకాన్గా గుర్తించబడిన చారిత్రక కట్టడం చార్మినార్. నాటి పాలకులైన కులీ కుతుబ్ షా ఈ చారిత్రక కట్టడాన్ని నిర్మించారు. 15వ శతాబ్దంలో నగరంలో ప్లేగు వ్యాధి ప్రబలి ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ మహమ్మారి నుంచి నగరాన్ని, ప్రజలను కాపాడాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొద్దికాలానికి ప్లేగు వ్యాధి తగ్గుముఖం పట్టడంతో ప్రార్థనలు జరిపిన స్థానంలోనే నేటి చారిత్రక కట్టడానికి పునాది వేశారు. చార్మినార్ను 1591లో ప్రారంభించినట్లు చరిత్ర పరిశోధకులు తెలియజేశారు.
ఏండ్ల తరబడి చెక్కుచెదరకుండా ఉన్న చార్మినార్ నిర్మాణంలో నాటి పాలకులు ప్రత్యేకశైలిని అవలంభించారు. కేవలం వివిధ రకాల మిశ్రమాలను వినియోగించి ప్రపంచ ప్రసిద్ధి నిర్మాణాన్ని పూర్తి చేశారు.
చార్మినార్కు నాలుగు వైపులా నాలుగు మినార్లు ఉన్నాయి. ఒక్కో మినార్ను 48 మీటర్ల ఎత్తులో సమాంతరంగా నిర్మించారు. చార్మినార్పైకి పర్యాటకులు ఎక్కడానికి ప్రతి మినార్లో వృత్తాకారంలో 149 మెట్లను నిర్మించారు. ఈ కట్టడాన్ని నాడు హిందూ, మొఘల్ వాస్తుశిల్పాల కలయికతో పూర్తిచేశారు.
చార్మినార్కు అమర్చిన గడియారాలను నాటి పాలకులు 1859లో లండన్ నుంచి ప్రత్యేకంగా దిగుమతి చేసుకున్నారు. నేటికీ ఆ గడియారాలు సమయాన్ని సక్రమంగా తెలియజేస్తుంది. ప్రతి 24 గంటలకోమారు గడియారాలకు కీ ఇవ్వడం వల్ల సరైన సమయాలను తెలియజేస్తుందని చార్మినార్ కన్జర్వేటర్ భానుప్రకాష్ తెలిపారు.
చారిత్రక కట్టడాన్ని భావితరాలకు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత పలుమార్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పలుమార్లు పాతనగరంలో పర్యటిస్తూ చారిత్రక చార్మినార్ను సంరక్షించేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. పాదచారుల కోసం ప్రత్యేక బాటను ఏర్పాటు చేశారు. చార్మినార్ చుట్టూ రూ. 55 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్డును అభివృద్ధి చేసి కాలుష్యం బారిన పడకుండా చేశారు. ప్రతియేటా కేంద్ర ఆర్కియాలజీ సంస్థ చార్మినార్ మరమ్మతులకు రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలు వెచ్చిస్తున్నది.
తెలంగాణ ప్రభుత్వం చార్మినార్కు మరింత ఖ్యాతిని అందించడానికి ప్రణాళికలను రూపొందించి అమలు పరుస్తుంది. అందులో భాగంగానే చార్మినార్ వద్ద ప్రతి ఆదివారం ఏక్ శామ్ చార్మినార్కే నామ్ పేరిట ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.