సిటీబ్యూరో, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ)/చార్మినార్: చారిత్రాత్మక చార్మినార్ వద్ద సరికొత్త సందడికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ‘ఏక్ షామ్.. చార్మినార్కే నామ్’ పేరుతో నిర్వహించే కార్యక్రమం నగరవాసులకు మరో ఫన్ జోన్గా మారనుంది. హైదరాబాద్ మహానగర ఐకాన్గా ఉన్న చారిత్రక కట్టడం వద్ద నిర్వహించే ఈ కార్యక్రమాన్ని నేటి (ఆదివారం) నుంచే సందర్శకుల సౌకర్యార్థం అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే హుస్సేన్సాగర్ ఒడ్డున నిర్వహిస్తున్న ‘సండే ఫన్ డే’ విజయవంతంగా కొనసాగుతుంది.
చారిత్రక నేపథ్యమున్న చార్మినార్ వద్ద నిర్వహిస్తూ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి అధికారులు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఆదివారం మొట్ట మొదటిసారిగా చార్మినార్ చెంత ఫన్ జోన్ను నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఫన్ జోన్లో భాగంగా చారిత్రక చార్మినార్ చుట్టూ నలు దిక్కులా నాలుగు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు.
చార్మినార్ తూర్పు అభి ముఖాన గజల్ కార్యక్రమం, పశ్చిమం వైపున భరత నాట్యం, ఉత్తరాన ముషాయిరా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. దక్షిణాన దక్కన్ ైస్టెల్లో భోజన స్టాల్స్ను ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు పోలీస్ బ్యాండ్, రాత్రి 8.30 గంటలకు దక్కనీ మజాహియా ముషారియా ఉంటుంది. గాజుల ప్రత్యేకమైన లాడ్ బజార్ను అర్థరాత్రి వరకు తెరిచి ఉంచనున్నారు. పిల్లలను ఆకట్టుకునేలా పలు కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.
చార్మినార్ చుట్టూ వాహనాలు తిరగకుండా కేవలం మనుషులు మాత్రమే హాయిగా తిరిగేలా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆదివారం సాయంత్రం ‘ఏక్ షామ్.. చార్మినార్ కే నామ్’ నేపథ్యంలో సందర్శకులకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా హైదరాబాద్ పోలీసులు అన్ని ఏర్పాట్లను చేశారు. చార్మినార్ వద్ద ఆదివారం సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్
మళ్లింపులు చేపట్టారు. ప్రత్యేకంగా పార్కింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినట్లు సిటీ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.
పెన్షన్ కార్యాలయం, మోతిగల్లి, ఉర్దూ మస్కాన్ అడిటోరియం, మోతిగల్లీ, కిల్వత్ మైదానం, ఏ.యూ. దవాఖా చార్మినార్,చార్మినార్ బస్సు టర్మినల్ ఇన్గేట్.
మదినా, పూరానాపూల్, గోషామహల్ వైపు నుంచి వచ్చే సందర్శకుల పార్కింగ్ స్థలాలు..
కులీ కుతుబ్ షా స్టేడియం, సిటీ కాలేజీ, ఎమ్.జె. బ్రిడ్జి
సందర్శకులు, వాహనదారులు పోలీసులకు సహకరించి ఆనందంగా ఈ వేడుకల్లో పాల్గొన్నాలని పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ సూచించారు.
ట్యాంక్బండ్పై హెచ్ఎండీఏ ప్రత్యేక ఏర్పాట్లు
‘సన్డే ఫన్ డే’తో ట్యాంక్బండ్ సందడికి కేరాఫ్ అడ్రస్గా మారుతోంది. ఐదు వారాల కిత్రం ట్యాంక్బండ్పై మొదలైన సందడి వారం వారం మరింత కొత్తదనంతో నగరవాసులను అలరిస్తోంది. వినాయకచవితి, బతుకమ్మ వేడుకలు సైతం ట్యాంక్బండ్పై ప్రత్యేకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వీటికి తోడు చార్మినార్ మట్టి గాజులు, ముత్యాల హారాలు, కృత్రిమ జువెలరీ, అత్తరు, ఇలా మొత్తంగా మహిళలు, మగువలు, అందరూ ఎంతగానో ఇష్టపడే పాతబస్తీ షాపింగ్ను ట్యాంక్బండ్పైకి తీసుకువచ్చారు.
ఆర్కెస్ట్రా… ఒగ్గుడోలు, బాణాసంచా, టీఎస్ పోలీస్ బ్యాండ్తో పాటు ఆర్మీ, రైల్వే పోలీస్ బ్యాండ్లను నిర్వహించారు. ఇలా ప్రతి వారం ఏదో ఒక ప్రత్యేకతతో నగర వాసులకు సరికొత్త అనుభూతిచ్చేలా ప్రభుత్వం అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. తినుబండారాల కోసం ప్రత్యేకంగా వివిధ రకాల వంటకాలను అందించే స్టాల్స్, మొబైల్ టాయిలెట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు ప్రతి వారం కార్యక్రమాన్ని పర్యవేక్షించి, నగర వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వచ్చే వారం మరింత సౌకర్యంగా, ఎక్కువ ఎంజాయ్ చేసేలా అవసరమైన వనరులను సమకూరుస్తున్నారు.