హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): సెకండ్ వేవ్లో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తున్నది. మొదటి దశతో పోలిస్తే ప్రస్తుతం కరోనా బారిన పడుతున్న వారు అత్యధికులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి 30 మంది కరోనా రోగుల్లో ఐదుగురు వైద్యశాలల్లో చేరుతుండగా వీరికి అత్యవసరంగా ఆక్సిజన్ అందించాల్సి వస్తున్నది. ఈ నేపథ్యంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అచ్చం సిలిండర్ల తరహాలో ఆక్సిజన్ అందిస్తున్న వీటిలో తరచూ ఆక్సిజన్ నింపాల్సిన అవసరం లేదు. చుట్టూ ఉన్న గాలి నుంచి ఆక్సిజన్ను గ్రహించి ప్రాణవాయువును అందిస్తాయి. తాజా పరిస్థితుల్లో ఆక్సిజన్ సిలిండర్లకు బదులు ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల వైపు రోగులు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వాటికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. దీంతో హైదరాబాద్లోని రోగుల అవసరాల నిమిత్తం పలు సంస్థలు, వ్యక్తులు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమకూర్చుతున్నారు. కొన్ని సంస్థలు ఉచితంగా అందిస్తుండగా.. మరికొందరు అద్దెకు.. ఇంకొందరు వాటిని విక్రయిస్తున్నారు.
మాదాపూర్, మే 17: కొండాపూర్లోని చండ్ర రాజేశ్వరరావు(సీఆర్) ఫౌండేషన్లోని వృద్ధాశ్రమానికి ఎన్ఆర్ఐ వైద్య బృందం రవి శాఖమూరి, శోభ శాఖమూరి, వెంకటేశ్రెడ్డిలు ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏకే జిలానీలతో కలిసి నాలుగు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా అందజేశారు.