కొండాపూర్, అక్టోబర్ 20: విశాఖ శ్రీ శారదాపీఠం పాలిత చందానగర్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ రజతోత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయం స్థాపించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నాలుగు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. తొలి రోజు విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి వార్ల పర్యవేక్షణలో గణపతి చతురావృతతర్పణ అభిషేకం, నర్సింహ స్వామి శిలా విగ్రహ సువర్ణ తాపడ ధ్వజ సంస్కరణ, చండీహోమం ఇత్యాది క్రతువులను వేద పండితులు ప్రారంభించారు.
రజతోత్సవ పూజా క్రతువులలో పాల్గొనే రుత్వికులకు, పండితులకు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి దీక్షా వస్ర్తాలను అందజేశారు. ఈ ఉత్సవాల్లో శ్రీ వరాహ స్వామికి అభిషేకం, పంచ గవ్యాధివాసం, క్షీరాభిషేకం, క్షీరాధివాసం, పూర్ణాభిషేకం, భూ వరాహ స్వామి శిలా విగ్రహ, పంచలోహ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
యాదాద్రి ఆలయానికి బంగారు తొడుగు చేయించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పానికి ముందే చందానగర్ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ధ్వజ స్తంభానికి బంగారు తాపడం రాష్ర్టానికి శుభసూచకమని పేర్కొన్నారు. భక్తుల కోర్కెలు తీర్చే వేంకటేశ్వరుడు రజతోత్సవాల సందర్భంగా విశేష పూజలతో దర్శనమివ్వనున్నట్లు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో భక్తులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ వేడుకల్లో పాల్గొనాలని ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు కోరారు.