సిటీబ్యూరో, జూలై 19(నమస్తే తెలంగాణ): పార్కు చేసిన బైక్ను దొంగిలించి.. గంటన్నర వ్యవధిలో ఏడు సెల్ఫోన్ స్నాచింగ్లకు పాల్పడిన ఘరానా దొంగను మలక్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీపీ అంజనీకుమార్, ఈస్ట్జోన్ జాయింట్ సీపీ రమేశ్రెడ్డి వివరాలు వెల్లడించారు. డబీర్పురాకు చెందిన సయ్యద్ ముదసీర్ క్యాటరింగ్ పనులు చేస్తుంటాడు. చిన్నతనం నుంచే దొంగతనాలు, దోపిడీలు చేస్తూ కాచిగూడ రైల్వే, రెయిన్బజార్ పోలీసులు నమోదు చేసిన కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత సెల్ఫోన్లు స్నాచింగ్ చేయాలని ప్లాన్ వేశాడు. ఈ ప్లాన్లో భాగంగా బెదిరించి ఓ హోండా క్లిక్ ద్విచక్ర వాహనాన్ని లాక్కున్నాడు. దానిపై ఈనెల 14న ఉదయం 6 నుంచి 7.25 గంటల మధ్య సైదాబాద్, సరూర్నగర్, సంతోష్నగర్, మాదన్నపేట్, మలక్పేట్ పోలీస్స్టేషన్ల పరిధిలో నడుచుకుంటూ వెళ్తున్న వారి చేతుల్లో నుంచి ఫోన్లు లాక్కొని పరారయ్యాడు. ఓ ఇంగ్లిష్ పత్రికలో పనిచేస్తున్న నరేందర్ మలక్పేట పీఎస్ పరిధిలో వెళ్తుండగా అతడి చేతులో నుంచి ఒప్పొ- ఎఫ్9 ఫోన్ను లాక్కొని పోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై రంగంలోకి దిగారు. నిందితుడికి హెల్మెట్ లేదని బాధితులు చెప్పడంతో ఆ దిశగా ఏసీపీ వెంకటరమణ నేతృత్వంలోని డీఐ నాను నాయక్, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ బృందాలు గాలింపు ముమ్మరం చేశారు. నిందితుడిని ఆదివారం పట్టుకొని ఏడు సెల్ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.