సిటీబ్యూరో, మార్చి 4(నమస్తే తెలంగాణ): చేసిన దొంగతనాల్లో జైలు శిక్షలు పడ్డాయి.. అదే సమయంలో రెండుసార్లు పీడీయాక్టులను ప్రయోగించారు.. అయినా కూడా బుద్ధి మార్చుకోకుండా చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్నాడు.. స్నాచింగ్లకు పాల్పడే క్రమంలో సైదాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి సుమారు రూ.3.5లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర సీపీ అంజనీకుమార్ కేసు వివరాలను వెల్లడించారు. ఓల్డ్మలక్పేటకు చెందిన సయ్యద్ అస్లాం అలియాస్ అస్లాం గత పదేండ్లుగా దొంగతనాలు చేస్తున్నాడు. ఇతడిపై 40 స్నాచింగ్ కేసులున్నాయి. 2016, 2018లో పీడీయాక్టులు ప్రయోగించారు. పలు కేసుల్లో జైలు శిక్షలు పడ్డాయి. 2020, సెప్టెంబర్లో జైలు నుంచి విడుదలయ్యాడు. మరో కేసులో హత్యాయత్నం కేసు నమోదైయింది. అప్పటి నుంచి పరారీలో ఉంటూ తిరిగి స్నాచింగ్లకు పాల్పడుతున్నాడు.
గత నెల 19న సంతోష్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో బైక్( టీఎస్11ఇఎన్8362)ను దొంగిలించి, దానిపై తిరుగుతూ స్నాచింగ్లకు పాల్పడ్డాడు. ఇలా.. గత నెల 21న రాత్రి ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో కిరాణా షాప్ వద్ద ఉన్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాక్కొని పరారయ్యాడు. దొంగిలించిన గొలుసును స్నేహితుడు నదీమ్ సహాయంతో వడ్డీ వ్యాపారి వద్ద తనఖా పెట్టి రూ. 50 వేలు తీసుకొని జల్సాల కోసం ముంబైకి వెళ్లాడు. ఆ డబ్బు అయిన తరువాత.. తిరిగి నగరానికి వచ్చి స్నాచింగ్లకు పాల్పడుతున్నాడు. స్నాచర్ సైదాబాద్లో తిరుగుతున్నాడనే సమాచారంతో సైదాబాద్ పోలీసులు రాజేంద్రనాయక్, ఈశ్వరయ్య అస్లాంను పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి ఆరున్నర తులాల బంగారం, బైక్ను మొత్తం సుమారు రూ. 3.5 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 2021లో 31 మందిపై పీడీయాక్టు ప్రయోగించామని, గత మూడేండ్లుగా 10 మంది స్నాచర్లపై పీడీయాక్టు పెట్టామని సీపీ తెలిపారు. సమావేశంలో ఈస్ట్జోన్ జాయింట్ సీపీ రమేశ్రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.