సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): గంజాయి లిక్విడ్ విక్రయిస్తున్న ఇద్దరిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 100 మిల్లీ లీటర్లు లిక్విడ్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ఫోర్స్ డీసీపీ రాధాకిషన్రావు కథనం ప్రకారం.. గుడిమల్కాపూర్కు చెందిన వడ్ల లక్ష్మీవెంకట నర్సింహాచారి డీజే సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో గంజాయి ద్రవ పదార్థాన్ని తెచ్చి, విక్రయించాలని పథకం వేశాడు. గుంటూరుకు చెందిన ప్రవీణ్ వద్ద నుంచి 100 మిల్లీ లీటర్ల గంజాయి తీసుకువచ్చాడు. దానిని 20 ప్యాకెట్లలో.. ఒక్కో ప్యాకెట్లో 5 మిల్లీ లీటర్ల చొప్పున ప్యాక్ చేశాడు. అతడికి తెలిసిన బీపీఓ ఉద్యోగి అయిన ముల్కాల భానుప్రకాశ్ అలియాస్ భాను కస్టమర్లను గుర్తించి వారికి విక్రయించడం, దానిపై కమీషన్ తీసుకునే విధంగా ఒప్పందం చేసుకున్నాడు. విశ్వసనీయ సమాచారంతో ఆదివారం గుడిమల్కాపూర్లోని లక్ష్మీవెంకట నర్సింహాచారి ఇంటిపై దాడిచేసి 100 ఎంఎల్ లిక్విడ్ గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. గుంటూరుకు చెందిన ప్రవీణ్ పరారీలో ఉన్నాడు. ఈ కేసు తదుపరి విచారణను ఆసీఫ్నగర్ పోలీసులకు అప్పగించారు.