సుల్తాన్బజార్,ఆగస్టు 9: అఫ్జల్గంజ్లోని రాష్ట్ర, కేంద్ర గ్రంథాలయం అతి పురాతన పుస్తకాలకు నెలవుగా మారింది. ఈ లైబ్రరీకి విదేశాల నుంచి పురాతన, విలువైన పుసక్తాలు ఇప్పటికీ వస్తుండటం విశేషం. 17,18వ శతాబ్దాలకు చెందిన పుస్తకాలను నేటి తరానికి అందించే లక్ష్యంతో 1977 వరకు ఉన్న సుమారు 45,700ల అతి పురాతన పుస్తకాలు, వార్తా పత్రికలను డిజిటలైజేషన్ చేసి గ్రంథాలయంలో అందరికీ అందుబాటులో ఉంచారు. నిజాం కాలం నుంచి నేటి వరకు తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ, అరబిక్, పర్షియన్ భాషల పుస్తకాలు, పత్రికలతో పాటు ఇరాన్, ఇరాక్, అమెరికా, ఇటలీ నుంచి పలు గ్రంథాలను సేకరించడం విశేషం. వీటిని డిజిటలైజేషన్ చేసిన గ్రంథాలయ నిర్వాహకులు త్వరలో దేశ, విదేశాల్లో ఎక్కడ ఉన్నా, ఎప్పుడైనా చూసుకునేలా వైబ్సైట్ను రూపొందించారు.
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 15 వరకు 17,18వ శతాబ్దానికి చెందిన గ్రంథాలను పుస్తక ప్రియులకు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాటు చేసిన ప్రదర్శనను రాష్ట్ర, కేంద్ర గ్రంథాలయం ముఖ్య గ్రంథపాలకుడు ఎ. వెంకటనర్సింహ రాజు సోమవారం ప్రారంభించారు. అనంతరం పుస్తక ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు, సంస్కృతం, ఇంగ్లిష్, ఉర్దూ, పర్షిషన్తో పాటు తొలి ఉర్దూ ఖురాన్, ఉర్దూలోని రామాయణ చరిత్ర, 1738 నాటి పురాతన పుస్తకాలు పాఠకులకు అందుబాటులో ఉంచామన్నారు. 1902 తొలి ఆంధ్రా పత్రిక, 1947 కంటే ముందు జరిగిన ఉద్యమాల చరిత్ర గ్రంథాలు , వార్తా పత్రికలు నేటికి చెక్కు చెదరకుండా భద్రపరిచి అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. కార్యక్రమంలో ఉద్యోగులు పీవీజీ రాణి, హనుమాన్ కేసరి పాల్గొన్నారు.