సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): విద్యుత్ సవరణ బిల్లు-2021కు వ్యతిరేకంగా నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర సదస్సుకు విద్యుత్ ఉద్యోగులందరూ హాజరై విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. ప్రతి విద్యుత్ ఉద్యోగి ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని తెలిపింది. బుధవారం జేఏసీ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమై కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు-2021 ప్రభావంపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేయడానికి శరవేగంగా పావులు కదుపుతున్నదని పేర్కొన్నారు.
ఈ ప్రయత్నాలను తిప్పి కొట్టడానికి ఎన్సీసీఓఈఈ కమిటీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ భవన్లో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. విద్యుత్ ప్రైవేట్ పరం అయితే కలిగే నష్టాలు, వాటి పరిణామాలు వివరించడానికి అనుభవజ్ఞులైన వక్తలు, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, ఆలిండియా కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, సీనియర్ జర్నలిస్టు, సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ ఎం.వేణుగోపాల్రావు ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారని తెలిపారు. ఉద్యోగులు అధిక సంఖ్యలో సదస్సుల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.