సిటీబ్యూరో, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : ఆలోచన ఉంటే చాలు సరికొత్త ఆవిష్కరణలకు రూపమిచ్చేందుకు సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ (సీఐఈ) కృషి చేస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ రంగంలో వస్తున్న మార్పులను గుర్తించి వాటిపై లోతైన అధ్యయనం చేసి నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టేందుకు దేశంలోని అత్యున్నత నైపుణ్యం కలిగిన ఐటీ రంగ నిపుణులు, గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థతో కలిసి సీఐఈ ముందుకు సాగుతున్నది. ఒక ఐటీ కంపెనీ చేయాల్సిన పనిని స్టార్టప్ కంపెనీ చేసేలా సాంకేతిక సహకారం అందిస్తున్నది. ఇప్పటికే సీఐఈ అనుభవాలను, విజయాలను ఆధారంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వం టీ-హబ్ను స్థాపించి స్టార్టప్లకు ప్రోత్సాహం అందిస్తున్నది. ఇందుకోసం ఐటీ రంగంలో 10 నుంచి 20 ఏండ్ల అనుభవం ఉన్న వారిని మార్గదర్శకులుగా నియమించి ఎమర్జింగ్ టెక్నాలజీస్తో స్టార్టప్లకు సహాయ సహకారాలను అందిస్తున్నారు.
ఇప్పటి వరకు ఎమర్జింగ్ టెక్నాలజీస్ల కింద 9 కీలక టెక్నాలజీస్లను గుర్తించారు. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలీజెన్స్, బిగ్ డేటా, బ్లాక్ చెయిన్, క్లౌడ్ కంప్యూటింగ్, రోబోటిక్ అండ్ డ్రోన్ టెక్నాలజీ, 3డీ ప్రింటింగ్, వీఆర్ అండ్ ఏఆర్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, స్పేస్ టెక్నాలజీ వంటివి ఉన్నాయి. ఒక టెక్నాలజీని ఏ రంగాలకు ఏ విధంగా ఉపయోగించవచ్చు, ప్రజలకు మెరుగైన సేవలు ఎలా అందించవచ్చు అనే దానిపై అధ్యయనం చేస్తూ ఒక్కో టెక్నాలజీతో ఒక్కో స్టార్టప్ పనిచేసేలా కృషి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు సీఐఈలోని స్టార్టప్ల ద్వారా అందుబాటులోకి వస్తున్నాయి.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త ప్రాజెక్టులు రూపొందించేందుకు, ఔత్సాహికులకు అవసరమైన సహాయ, సహకారాలను అందించేందుకు 2008లోనే గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో సీఐఈ కేంద్రాన్ని ప్రారంభించారు. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత స్టార్టప్లకు అధిక ప్రాధాన్యతనిస్తూ టీ-హబ్ను ఏర్పాటు చేసింది. ఇది దేశంలోనే అతి పెద్ద ఇంకుబేటర్గా నిలిచింది. టీహబ్కు దేశ నలుమూలల నుంచి ఎంతో ఆదరణ ఉంది. కాగా టీ-హబ్లో టెక్నాలజీతో పాటు వివిధ రంగాలకు చెందిన స్టార్టప్లకు అవకాశం ఉంటే, సీఐఈలో మాత్రం కేవలం టెక్నాలజీకి సంబంధించిన స్టార్టప్లకు మాత్రమే స్థానం కల్పించి, లోతైన అధ్యయనం, అభివృద్ధి జరిగేలా డీప్ టెక్ యాక్సలేటర్ ప్రోగ్రామ్ను ప్రారంభించారు.
సీఐఈలోని ఆవిష్కార్కు
ఎక్స్మ్యాచిన్స్
లాగీ.ఏఐ
దేవ్.ఏఐ
ఐపీ హాక్
మ్యాచ్స్టాట్
ఈస్కిన్ డాక్టర్
వ్యొమిక్ డ్రోన్స్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో ఎప్పటికప్పుడు సరికొత్త ఆవిష్కరణలు వస్తుంటాయి. ఎమర్జింగ్ టెక్నాలజీస్ను గుర్తించి ఔత్సాహిక స్టార్టప్లకు సరైన సలహాలు, సాంకేతిక సహకారంతో పాటు సీఐఈలోనే తమ కార్యకలాపాలను కొనసాగించే అవకాశం కల్పిస్తాం. టెక్నాలజీల్లో నైపుణ్యం ఉన్న వారికి ఉద్యోగావకాశాలు అధికంగా ఉన్నాయి. వీటితోనే కొత్తగా స్టార్టప్ కంపెనీలను ప్రారంభించేందుకు అవకాశం ఉంది. టెక్నాలజీ పరంగా ఔత్సాహిక స్టార్టప్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా సీఐఈ ప్రత్యేక కార్యక్రమాలను ఏడాది పొడవునా చేపడుతుంది.- రమేశ్ లోగ్నాథన్, హెడ్ ఆఫ్ సీఐఈ, ట్రిపుల్ ఐటీ.