“ఉదయం నిద్ర లేవగానే తొలుత చూపంతా దానిమీదే.. రోజులో అధిక సమయం దాంతోనే కాలక్షేపం.. రాత్రి నిద్రకు ఉపక్రమిస్తున్న సమయం వరకు కూడా దానిపై వేళ్లు తచ్చాడనిదే మనసు కుదురుగా ఉండదు.” అదే మొబైల్. మనిషికి నిత్య అవసరంగా మారిన సాధనం. ఈ నేపథ్యంలో మొబైల్ ఉపయోగం నగరవాసుల నిద్రను ఎలా శాసిస్తోందో వేక్ఫిట్.కో అధ్యయనం(ది గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్కార్డ్-2020-21)లో వెల్లడించింది. నిద్రపోయే ముందు 94 శాతం హైదరాబాదీలు మొబైల్ ఫోన్లతోనే గడుపుతున్నారని పేర్కొంది. దేశంలో నిద్ర అలవాట్లపై జరిపిన 4వ అతిపెద్ద అధ్యయనం ఇదే కావడం విశేషం. ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లపై ఎక్కువగా అవగాహన ఉన్నది హైదరాబాదీలకేనని సర్వే తెలిపింది.
దేశవ్యాప్తంగా 16 వేల మందిపై అధ్యయనం సాగింది. వారి అభిప్రాయాలను సేకరించి విశ్లేషించింది. గత ఏడాది జరిపిన ఇదే తరహా సర్వేలో హైదరాబాదీలు 91 శాతం నిద్రకు ముందు మొబైల్ వినియోగిస్తున్నారని వెల్లడించింది. ఈ ఏడాది అది 94 శాతంగా నమోదైంది. హైదరాబాద్లో జరిపిన అధ్యయనం ప్రకారం 80 శాతం మంది తాము పనిచేస్తున్నప్పుడు వారంలో ఒకటి నుంచి మూడు రోజులు నిద్ర కరువై మబ్బుగా(మగత) ఉంటున్నట్లు చెప్పినట్టు సర్వే వివరించింది.26 శాతం మంది ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్లలో అర్ధరాత్రి వరకు సినిమాలు చూస్తున్నారని, 16 శాతం మంది బెడ్పై పడుకుని ల్యాప్టాప్ లేదా స్మార్ట్ఫోన్ వినియోగించి పని చేస్తున్నారని అధ్యయనంలో వెల్లడించింది. దీంతో పాటు 40 శాతం మంది వెన్ను సమస్యలతో బాధపడుతున్నట్టు పేర్కొంది. 90 శాతం మంది రాత్రిళ్లు ఒకసారి లేదా రెండు సార్లు మొబైల్ చూడటానికే మేల్కొంటున్నారని సర్వే తెలిపింది. కాగా 38 శాతం మంది నగరవాసులు మెరుగైన పరుపులు తమను సుఖ నిద్రకు ఉపక్రమింపజేస్తాయని వెల్లడించారు. 32 శాతం మంది మొబైల్కు దూరంగా ఉంటే నిద్ర బాగా పడుతుందని 28 శాతం మంది సరైన నిద్ర అలవాట్లను పాటించడంతో స్లీపింగ్ బాగుంటుందని సర్వే వెల్లడించింది.