బంజారాహిల్స్, సెప్టెంబర్ 23 : రెస్టారెంట్లోని లేడీస్ బాత్రూమ్లో సెల్ఫోన్ పెట్టి రికార్డింగ్ చేసిన వ్యవహారంలో నిందితుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని జువైనల్ హోమ్కు తరలించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.10లోని డ్రైవ్ ఇన్లోని రెస్టారెంట్లో హౌజ్కీపింగ్గా పనిచేస్తున్న నిందితుడు మైనర్గా తేలింది. ఈ వ్యవహారంపై జూబ్లీహిల్స్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. నల్గొండ జిల్లాకు చెందిన నిందితుడు పదవ తరగతి దాకా చదువుకుని ఆరునెలల కిందట నగరానికి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. రెస్టారెంట్లో బాత్రూమ్లు శుభ్రం చేస్తుంటాడు. కాగా ఈనెల 10న రూ.14వేలు పెట్టి సెల్ఫోన్ కొన్నాడు. ఫోన్లో సిమ్ కార్డు తీసేసి మంగళవారం రాత్రి తాను పనిచేస్తున్న రెస్టారెంట్లోని లేడీస్ బాత్రూమ్లో ఫోన్ను రికార్డింగ్లో పెట్టినట్లు పోలీసులు నిర్ధారించారు.
నాలుగు గంటల తర్వాత బాధిత యువతి ఫోన్ను గుర్తించి యాజమాన్యానికి చెప్పడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తీవ్ర కలకలం రేపడంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. కాగా ఈ వ్యవహారంలో ఇంకా ఎవరికైనా పాత్ర ఉందా.. అనే అంశంపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన చోటు చేసుకున్న డ్రైవ్ ఇన్ మేనేజర్తో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ప్రాథమికంగా నిందితుడు ఒక్కడే అని తేలింది. రెస్టారెంట్లో మిగిలిన సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజీలు స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడి కదలికలను పరిశీలిస్తున్నారు.