మారేడ్పల్లి, మార్చి 27: దేశంలోనే నం.1.. తెలంగాణ పోలీస్ అని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టులో భాగంగా రూ. 3.5 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేసిన 358 సీసీ కెమెరాలను శనివారం ప్యాట్నీ సెంటర్లోని ఎస్వీటీ ప్రాంగణంలో హోం మంత్రి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డీజీపీ మహేందర్రెడ్డి, నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, ఎమ్మెల్యే సాయన్నతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నేరాల నియంత్రణకు తెలంగాణ పోలీస్ పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు ఎంతో కీలకంగా మారాయని… దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 65 నుంచి 70 శాతం తెలంగాణలోనే ఉన్నాయని అన్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో 6.5 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం సీఎం కేసీఆర్ శాంతి భద్రతల పరిరక్షణకు అధిక ప్రాధన్యత ఇచ్చారని.. దీంతో ఎక్కడ కూడా శాంతి భద్రతల సమస్యలు తలెత్తలేదన్నారు.
రూ .700కోట్లతో పెట్రోకార్ ఏర్పాటు, ప్రెండ్లీ పోలీసింగ్ లాంటి వాటితో సీఎం కేసీఆర్ పోలీసు వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొని వచ్చారని హోంమంత్రి అన్నారు. రూ.600 కోట్లతో ఏర్పాటు చేస్తున్న కమాండ్ కంట్రోల్ పనులు 80 శాతం పనులు పూర్తయ్యాయని .. మరో 6 నెలల్లో పనులు మొత్తం పూర్తి అవుతాయని చెప్పారు. మరిన్ని సీసీ కెమెరాల కోసం నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రెండు కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు హోం మంత్రి తెలిపారు.
ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే నేరాలను పూర్తి స్థాయిలో నియంత్రించవచ్చని అన్నారు. సీఎం కేసీఆర్ నగరంలో లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారని… ఇప్పుడు హైదరాబాద్ నగర కమిషనరేట్ పరిధిలో 3.75 లక్షలు, మూడు కమిషనరేట్ల పరిధిలో 6.5లక్షల సీసీ కెమెరాలు ఉన్నాయని అన్నా రు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు శిఖాగోయెల్, చౌహాన్, అనిల్కుమార్, జాయిం ట్ కమిషనర్లు తరుణ్ జోషి, శ్రీనివాసరావు, రమేశ్ రెడ్డి, డీపీసీ కల్మేశ్వర్ సింగన్వార్, కార్ఖాన ఇన్స్పెక్టర్ మధుకర్స్వామి, కార్పొరేటర్ హేమలత తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో సీఎం కేసీఆర్ పోలీసు వ్యవస్థను పటిష్టం చేస్తూ పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమెరికా మాదిరిగా హైదరాబాద్ నగరంలో పోలీసు పెట్రోలింగ్ వాహనాలను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి నేరాలను పూర్తి స్థాయిలో నియంత్రించగలిగామన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు తన నియోజకవర్గ నిధుల్లో నుంచి సనత్నగర్ నియోజవర్గానికి రూ.1 కోటి, నగర పోలీసు పరిధిలోకి మరో రూ.1 కోటి నిధులు అందిస్తానని చెప్పారు. నగరంలో మరిన్ని సీసీ కెమెరాల నిమిత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో మాట్లాడి మరిన్ని నిధులు వచ్చేలా చూస్తానని మంత్రి అన్నారు.