ప్రపంచస్థాయి నగరాలతో పోటీపడుతూ సురక్షితమైన నగరంగా హైదరాబాద్ రూపుదిద్దుకున్నది. ఇందుకు పటిష్టమైన శాంతి భద్రతలు ఉండటమే.. అలాగే సీసీ కెమెరాల వ్యవస్థను పటిష్టం చేశారు. భారత దేశంలోనే సీసీ కెమెరాలు ఎక్కువగా కల్గి ఉన్న నగరంగా హైదరాబాద్ పేరుగాంచింది. ప్రపంచ నగరాల్లో 16వ స్థానాన్ని సొంతం చేసుకున్నది. పోలీసుల నిరంతరం నిఘా, సీసీ కెమెరాలతో నేరాలు 50 శాతం తగ్గాయి.. దోపిడీ చేస్తే పోలీసులకు పట్టుబడుతామనే భయం దొంగల్లో ఉంది.. దీంతో దొంగతనాలు, దోపిడీలు, చైన్స్నాచింగ్లు తగ్గాయి.
నగరంలో టెక్నాలజీ పరమైన సంస్కరణలతో నేరాలను అదుపు చేస్తూ, పటిష్టమైన శాంతి భద్రతలను ఏర్పాటు చేశారు. ఎలాంటి కేసునైనా గంటల వ్యవధిలోనే ఛేదించే పటిష్టమైన టెక్నాలజీ పరమైన వ్యవస్థను మూడు పోలీస్ కమిషనరేట్ల పోలీసులు కల్గి ఉన్నారు. దీంతో తప్పు చేసిన వారికి శిక్షలు పడుతున్నాయి.. నేరాలు తగ్గుతున్నాయి. అంతర్రాష్ట్ర ముఠాలను నగరం వైపు చూడకుండా కట్టడి చేశారు. తప్పు చేసిన వారు తమ నేర ప్రవృత్తిని మానుకోకపోతే వెంటనే అలాంటి వారిపై పీడీయాక్టును ప్రయోగిస్తున్నారు. నేరాలు తగ్గి.. రికవరీలు 60 శాతం పెరిగాయి. చైన్ స్నాచింగ్ల మాట లేకుండా చేశారు. ఎక్కడైనా ఎప్పుడైనా స్నాచింగ్ జరిగిందంటే గంటల్లోనే ఛేదిస్తున్నారు.
మహిళల భద్రత కోసం షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయి. డయల్ 100కు ఫోన్ చేస్తే 5 నుంచి 8 నిమిషాల వ్యవధిలోనే బాధితుల వద్దకు చేరుకుంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్తో పారదర్శకంగా పోలీసులు సేవలందిస్తూ ప్రజలకు దగ్గరయ్యారు. రోడ్లపై ప్రతి సంవత్సరం వాహనాల సంఖ్య పెరుగుతున్నా .. అన్ని శాఖల సమన్వయంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా, ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కబెడుతూ వాహనాల వేగం పెరిగే విధంగా చర్యలు తీసుకుంటూ.. సత్ఫలితాలు సాధిస్తున్నారు. మరో పక్క రోడ్డు ప్రమాదాల్లో మరణాలు ప్రతి యేటా తగ్గుతున్నాయి. శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది.. ప్రభు త్వ ఆశయానికి అనుగుణంగా ప్రజలకు పోలీసులు మెరుగైన సేవలు అందిస్తున్నారు.
తెలంగాణ వచ్చిననాటి నుంచి హైదరాబాద్లో మతపరమైన, రాజకీయ పరమైన అల్లర్లు, గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణం నెలకొంది. పక్కాగా శాంతి భద్రతలను కాపాడుతూ ట్రై పోలీస్ కమిషనరేట్ల పోలీసులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఇదిలాఉండగా మారుతున్న సమాజంలో సైబర్నేరాలు పెరుగుతున్నాయి. ఆ సైబర్నేరాలను సైతం కట్టడి చేయడంలో సైబర్ వింగ్ పటిష్టంగా పనిచేస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తూ అంతర్జాతీయగుర్తింపు పొందుతున్నారు.