ఖైరతాబాద్, జూన్ 24 : ఆటోలో మరిచిపోయిన లక్షలాది రూపాయలు విలువ చేసే కెమెరాల లెన్స్లను పంజాగుట్ట పోలీసులు సీసీ ఫుటేజీల సాయంతో గుర్తించారు. డీఐ నాగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.3లోని జర్నలిస్టు కాలనీలో సాయిశరత్, అనురాగ్, రాణాలు బ్లింక్ ఈవెంట్ ఫొటోగ్రాఫర్స్ పేరుతో షాపు నిర్వహిస్తున్నారు. షార్ట్ ఫిల్మ్స్, ఈవెంట్స్, వివాహాలకు ఫొటోలు, వీడియోలు తీస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 22న ఓ కార్యక్రమానికి హాజరై తిరుగు ప్రయాణంలో ఓ ఆటోను మాట్లాడుకున్నారు. కెమెరాలను ఆటోలోని వెనుక బాగంలో ఉంచారు. ఫోన్ రావడంతో ఆటో డ్రైవర్కు డబ్బులిచ్చి పంజాగుట్ట ఎన్ఎఫ్సీఎల్ క్రాస్రోడ్లో దిగిపోయారు. అప్పటికే ఆటో వెళ్లిపోగా, ఆలస్యంగా గుర్తుకు రావడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కెమెరాలు, లెన్స్ల విలువ సుమారు రూ.20లక్షలు ఉంటుందని బాధితులు పోలీసులకు వివరించారు.
ఆటో ఆచూకి తెలుసుకునేందుకు ఏసీపీ పీవీ గణేశ్, డీఐ నాగయ్య నేతృత్వంలో పోలీసుల బృందం దర్యాప్తు ప్రారంభించింది. వారు దిగిన చోట సీసీటీవీ ఫూటేజీలలో ఆటో కనిపించినా దానికి నంబరు ప్లేటు లేకపోవడంతో ట్రేస్ చేయడంలో కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆటోపై ఉన్న ఈగల్ (గద్ద) బొమ్మ ఆదారంగా అది ప్రయాణించిన అమీర్పేట్, పంజాగుట్ట, మెహిదీపట్నం రహదారుల్లో ఉన్న సుమారు 60కిపైగా సీసీకెమెరాలను పరిశీలించారు. గురువారం మాసబ్ట్యాంకు వద్ద ఆటో నిలిచి ఉండటాన్ని గమనించి వెంటనే సిబ్బందితో అక్కడికి చేరుకోగా, ఆటో వెనుక బాగంలోనే కెమెరాల బ్యాగులు సురక్షితంగా ఉన్నాయి. దీంతో వాటిని స్టేషన్కు తరలించి బాధితులకు సమాచారం అందించారు. అనంతరం నగర జాయింట్ సీపీ, వెస్ట్ జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ చేతుల మీదుగా బాధితులకు అప్పగించారు.