నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర అమోఘమని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరిధిలోని తార్నాకలో 15 నూతన సీసీ కెమెరాలను నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలో ప్రజల రక్షణ దృష్ట్యా సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.1.85 కోట్ల నిధులు కేటాయించామన్నారు. అందులో భాగంగా తొలి విడుతలో చిలకలగూడ పోలీస్స్టేషన్కు రూ.60 లక్షలు, తుకారాంగేట్ పోలీస్స్టేషన్కు రూ.25 లక్షలు, లాలాగూడ పోలీస్స్టేషన్కు రూ.25 లక్షలు, ఉస్మానియా పోలీస్స్టేషన్కు రూ.25 లక్షలు కేటాయించి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. రెండో విడుతలో నాలుగు పోలీస్స్టేషన్లకు కలిపి రూ.50 లక్షలు కేటాయించామన్నారు. వంద మంది పోలీసులు చేసే పనిని ఒక్క సీసీ కెమెరా చేస్తుందని ఆయన అన్నారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ సీసీ కెమెరాలతో ఎన్నో లాభాలున్నాయన్నారు. సీసీ కెమెరాల కోసం అత్యధికంగా నిధులు కేటాయించిన ప్రజా ప్రతినిధుల్లో తీగుళ్ల పద్మారావు గౌడ్ ముందున్నారన్నారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ రమేశ్రెడ్డి, కాచిగూడ ఏసీపీ ఆకుల శ్రీనివాస్, ఓయూ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ నాయక్ పాల్గొన్నారు.