సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : నీటి సంరక్షణను ప్రోత్సహించడానికి, వర్షపు నీటి సేకరణ కోసం వాటర్ ఎయిడ్ సంస్థ వినూత్న ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గ్రౌండ్ వాటర్ బోర్డు సమన్వయంతో ‘క్యాచ్ ది రెయిన్ క్యాంపెయిన్’ను చేపట్టింది. ఈ కార్యక్రమాన్ని బుధవారం తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వి.ప్రకాశ్రావు కూకట్పల్లి సర్కిల్లో గ్రౌండ్ వాటర్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పండిత్ మధునూరుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షపు నీటి సంరక్షణ బాధ్యత అందరూ తీసుకోవాలని, వినూత్న పద్ధతులు అవలంభించి వాటిని డాక్యుమెంట్ చేయాలని సూచించారు. బిల్డర్స్తో సమావేశాలు ఏర్పాటు చేసి దాని ఆవశ్యకతను వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ ఎయిడ్ ఇండియా ప్రతినిధులు రాజేశ్ రంగరాజన్, మానస్ కుమార్ బిస్వాల్, ఎంఎన్బి రాజు తదితరులు పాల్గొన్నారు.