హిమాయత్నగర్, జూలై 13 : పెంపుడు పిల్లి తప్పిపోయిందంటూ ఓ జంతు ప్రేమికురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో పిల్లి ఆచూకీ తెలిపితే రూ.30 వేలు రివార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మంగళవారం హైదర్గూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టోలిచౌకి ప్రాంతానికి చెందిన సెరేనా వివరాలు వెల్లడించింది. జంతువులంటే తనకు ఎంతో ఇష్టమని, చిన్న తనం నుంచి ఇంట్లో పలు రకాల జంతువులను పెంచుతున్నట్లు తెలిపింది. గత ఎనిమిది నెలల కిందట ఓ పిల్లి పిల్లను తెచ్చుకొని దానికి జింజర్ అని నామకరణం చేసినట్లు పేర్కొంది. కరోనా నేపథ్యంలో పిల్లికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించేందుకు జూబ్లీహిల్స్లోని ఓ పెట్ క్లినిక్కు తీసుకువెళ్లగా.. గత నెల 17న శస్త్ర చికిత్స చేసినట్లు తెలిపింది. అయితే ఆపరేషన్ చేసిన చోట వాపు రావడంతో 23న అదే ఆస్పత్రికి తీసుకెళ్లగా, వారు అడ్మిట్ చేసుకొని చికిత్స ప్రారంభించినట్లు పేర్కొంది. అయితే గత నెల 24న పిల్లి తప్పిపోయిందని ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పగా.. రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేయలేదని తెలిపింది. దీంతో తానే స్వయంగా కరపత్రాలు, ప్లకార్డులు తయారు చేసి పంపిణీ చేస్తున్నానని, ఆచూకీ తెలిపిన వారికి రూ.30వేలు నగదు బహుమతి ఇస్తానని ప్రకటించింది.