సైదాబాద్ : జన గణన -2021లో కులాల ఆధారంగా జనాభాను లెక్కించాలని కోరుతూ అఖిల భారత యాదవ మహసభ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మైల్కోల్ మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్కు వినతి పత్రం అందజేశారు. తమ వినతి పత్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి పంపించాలని వారు కోరారు. ఈ సందర్భంగా అఖిల భారత యాదవ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్. లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ కుల జనాభా గణన 1931లో జరిగిందని, ఆ తర్వాత ఇప్పటి వరకు జరగలేదని అన్నారు.
తమ సంస్థ జాతీయ కార్యవర్గ అదేశాల మేరకు దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ద్వారా ప్రధాన మంత్రి మోడీకి వినతి పత్రాలను పంపుతున్నామని, అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మొదట హైదరాబాద్ కార్యవర్గం తరుపున జిల్లా కలెక్టర్ శర్మన్ కలిసి వినతి పత్రాన్ని అందజేశామని తెలిపారు. గ్రేటర్ అధ్యక్షుడు మైల్కోల్ మహేందర్ యాదవ్ మాట్లాడుతూ మహారాష్ట్ర, బీహార్, ఒరిస్సా రాష్ట్రాల బీసీల డిమాండ్ మేరకు కులాల వారీగా జనాభా గణన చేయాలని అసెంబ్లీ తీర్మానం చేసి అమోదించినట్లుగానే, తెలంగాణ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చోరవ తీసుకుని అసెంబ్లీ తీర్మానం చేయాలని ఆయన కోరారు.
2021 జన గణన కులాల వారీగా సర్వే చేయాలని తద్వారా కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాల్లో అర్హులైన బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందుతాయన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఐలబోయిన రమేశ్ యాదవ్, ప్రధాన కార్యదర్శి గొర్ల యశ్వంత్ యాదవ్, గ్రేటర్ యువజన అధ్యక్షుడు విజయ్కుమార్ యాదవ్,కోశాధికారి శ్రీశైలం యాదవ్, అక్కెం నర్సింగ్ యాదవ్, మల్లికార్జున్, కృష్ణతేజ యాదవ్, శివయాదవ్ తదితరులు పాల్గొన్నారు.