గ్రేటర్ పరిధిలోని ఆర్టీసీ బస్సులలో క్యాష్ లెస్ టిక్కెట్ విధానం తీసుకురావడానికి జీహెచ్ఎంసీ జోన్ అధికారులు సన్నాహాలు ముమ్మరం చేశారు. ప్రధానంగా కొవిడ్ వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో భాగంగా క్యాష్కు బదులుగా స్మార్ట్ టిక్కెట్ విధానమే శ్రేయస్కరమని అధికారులు భావించారు. అందుకోసం ప్రయాణికుల వద్ద ఉండే స్మార్ట్ ఫోన్లతోనే బస్సు టిక్కెట్ జనరేట్ అయ్యేలా ప్రత్యేక యాప్ను జీహెచ్ఎంసీ జోన్కు చెందిన అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. యాప్ రూపకల్పన కోసం ప్రైవేటు సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. అయితే, ఇంటర్నెట్తోను, ఇంటర్నెట్ లేకుండా కూడా క్యాష్లెస్ టిక్కెట్ను పొందే వెసులుబాటు ఈ యాప్లో ఉంటుంది. స్మార్ట్ ఫోన్ ద్వారా డౌన్లోడ్ చేసుకున్న ప్రత్యేక యాప్ ద్వారా ప్రయాణికులు చేరుకునే గమ్య స్థానాన్ని బట్టి టిక్కెట్ జనరేట్ కావడంతో పాటు ఆ టిక్కెట్కు సంబంధించిన డబ్బులు కూడా స్మార్ట్ఫోన్ ద్వారా కట్ అవుతాయి. అయితే, ప్రస్తుతం 16వ నంబర్ రూట్కు సంబంధించి ప్రయోగాత్మకంగా యాప్ రూపకల్పన జరుగుతుందని, త్వరలోనే దీనిపై మరికొంత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్టీసీ జీహెచ్ఎంసీ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.వెంకటేశ్వర్లు తెలిపారు.