బంజారాహిల్స్,జూన్ 30: కొవిడ్ బారిన పడిన వారిలో గుండె సమస్యలు ఎంతమందికి వచ్చాయనే అంశంపై కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గణాంకాలు సేకరిస్తున్నామని సొసైటీ అధ్యక్షుడు డా.కే.నరసరాజు తెలిపారు. జూబ్లీహిల్స్ రోడ్ నం10లోని కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా -రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కొవిడ్ సమయంలో అత్యవసరంగా వైద్య సలహా కోసం చూస్తున్న వారికి తమ సొసైటీ ఆధ్వర్యంలో టోల్ఫ్రీ నంబర్ 1800 059 93098ను అందుబాటులోకి తీసుకొస్త్తున్నామన్నారు. అత్యవసర సమయాల్లో కార్డియాలజీ సంబంధించిన సమస్యలు తలెత్తితే దవాఖానకు చేరుకునేలోగా కావాల్సిన సలహాలను అందించేందుకు ఈ టోల్ఫ్రీ నంబర్ పనిచేస్తుందన్నారు. సోమవారం నుంచి శుక్రవారం దాకా ఈ టోల్ఫ్రీ నంబర్ పనిచేస్తుందన్నారు. కొవిడ్ రెండోదశలో ఎక్కువగా 30నుంచి 55 ఏండ్ల మధ్య వయస్సు గల వారు ఎక్కువగా ఇబ్బందులు పడ్డారని, వారిలో ఎంతమంది కార్డియో సమస్యలతో బాధపడ్డారనే విషయంపై గణాంకాలను సేకరిస్తున్నామన్నారు. ఈ డాటా ఆధారంగా భవిష్యత్తులో తగు చికిత్సలు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో కార్డియలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా గౌరవ కార్యదర్శి డా. రవికాంత్, ఉపాధ్యక్షులు డా.వీ. ముఖేశ్రావు, డా.గురుప్రకాశ్ డా.పెద్ది శ్రీధర్రెడ్డి , డా.రాజీవ్ గర్గ్ ఉన్నారు.