హైదరాబాద్ : దేశంలో తెలంగాణ రాష్ట్రం తప్ప ఎక్కడా రైతు వద్ద నుంచి ఒక్క గింజ కూడా కొనడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా ప్రతిపక్షాలు రైతుల వద్దకు పోయి ధర్నాలు చేయాలని కుయుక్తులకు పాల్పడుతున్నరు. కానీ వాస్తవం తెలిసిన, విజ్జత కలిగిన రైతులు ప్రతిపక్షాల ఆటలు సాగనిస్తలేరు. తిట్టి ఎల్లగొడుతున్నరని సీఎం అన్నారు. వ్యవసాయరంగంపై శనివారం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత సంవత్సరంలో కరోనా సమయంలో ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలితే తెలంగాణ జీఎస్డీపీకి వ్యవసాయరంగం 17 శాతం ఆదాయన్ని అందచేసిందన్నారు. ఇంకా పరోక్షంగా రాష్ట్ర ఆదాయానికి వ్యవసాయరంగం ఆదెరువుగా మారే పరిస్థితికి చేరుకున్నదని సీఎం అన్నారు.
ధాన్యం దిగుబడిలో తెలంగాణది దేశంలోనే నెంబర్ వన్ స్థానం అని సీఎం అన్నారు. ఒక్క కారు మాత్రమే వరి పంట పండించే పంజాబ్ కన్నా తెలంగాణలో రెండు పంటల ద్వారా అధిక దిగుబడి వచ్చిందన్నారు. రాబోయే కాలంలో మెదక్, మహబూబ్నగర్ తదితర జిల్లాల్లో ఇంకా మరికొన్ని ప్రాజెక్టులను, లిఫ్టులను పూర్తి చేసుకోబోతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయరంగం నూటికి నూరు శాతం స్థిరీకరించబడుతుందన్నారు.
దేశంలో ఏరాష్ట్ర ప్రభుత్వం చేయని సాహసాన్ని తెలంగాణ చేసిందన్నారు. కరోనా సమయంలో లారీలు, హమాలీలు, డ్రైవర్లు, అన్ని కొరతే అయినా వాటన్నిటినీ అధిగమిస్తూ ఇప్పటికే 87 శాతం ధాన్యాన్ని సేకరించినట్లు సీఎం తెలిపారు. మరో నాలుగైదు రోజుల్లో సంపూర్ణ సేకరణ జరగనుందన్నారు. ఎఫ్సీఐతో మాట్లాడి ఎంత ధాన్యం వచ్చినా ప్రభుత్వం తప్పకుండా కొంటుందన్నారు. రైతులు భయాందోళనలకు గురికావద్దన్నారు.