ఖైరతాబాద్, జూలై 12: గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థి, యువత చదువులు నామమాత్రంగానే సాగుతాయి. కొందరు ప్రాథమిక విద్యను పూర్తి చేసి చదువులకు స్వస్తి చెబుతుండగా.. మరికొందరు మాత్రం పట్టణాలకు వెళ్లి డిగ్రీలు చదివి ఉపాధిని వెతుక్కుంటున్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలపై సరైన అవగాహన లేక ఎందరో గ్రామీణులు ఇంటికే పరిమితమవుతున్నారు. అలాంటి వారికి కొత్త దారి చూపుతున్నది నగరానికి చెందిన క్యాంపస్ క్రాప్, వీ-రీప్ సంస్థలు. ఇప్పటి వరకు వేర్వేరుగా పని చేస్తున్న ఆ రెండు సంస్థలు సంయుక్తంగా గ్రామీణ ప్రాంతాల్లో తమ సేవలను విస్తరించేందుకు ఎంఓయూ చేసుకున్నాయి. సోమవారం సోమాజిగూడలోని క్యాంపస్ క్రాప్ సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ కో ఫౌండర్ రష్మి, వీ-రీప్ ఫౌండేషన్ కో ఫౌండర్ పి.లక్ష్మితో కలిసి పరస్పర ఒప్పందం చేసుకున్నారు. అనంతరం ఆయా సంస్థలు చేస్తున్న కార్యక్రమాలను మీడియాకు వివరించారు.
మూడు సంవత్సరాల క్రితం యుగేందర్ రెడ్డి, పి.లక్ష్మి వీ-రీచ్ ఫౌండేషన్ను స్థాపించారు. గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక విద్యార్థి, యువతకు కెరీర్ గైడెన్స్ ఇస్తున్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగ సాధనలో మార్గనిర్దేశం చేస్తున్నారు. మహిళా సాధికారతే లక్ష్యంగా ఎందరికో వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చూస్తున్నారు. గ్రామానికి ఒకరు కెరీర్ మార్గదర్శకులను నియమిస్తూ తాము నేర్చుకున్న విద్యను తోటి గ్రామీణులకు అందించేందుకు కృషి చేస్తున్నారు. వీ-రీచ్ కోసం తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లోని 110 గ్రామాల్లో 3,500 మంది వలంటీర్లు పని చేస్తుండటం విశేషం.
పది సంవత్సరాల క్రితం ఎన్వీఎన్ మహేశ్, రష్మిలు క్యాంపస్ క్రాప్ను ఏర్పాటు చేశారు. ఏఐ(ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్) సాయంతో సైకొమెట్రిక్ అసెస్మెంట్ విధానంలో విద్యార్థులకు ఉన్నత చదువులు, ఉద్యోగం ఎంపికలో సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఐదు కోణాల ఆధారంగా (పర్సనాలిటీ, కెరీర్ ఇంట్రెస్ట్, కెరీర్ మోటివేషన్, స్కిల్స్, లెర్నింగ్ ఎబిలిటీస్) విద్యార్థుల మస్తిష్కాల్లో ఉన్న లక్ష్యాలను తెలుసుకొని కెరీర్ గైడెన్స్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం 25 వేల మందికి ఈ తరహా సూచనలు, సలహాలు ఇస్తున్నామని క్యాంపస్ క్రాస్ సంస్థ కో ఫౌండర్ రష్మి తెలిపారు. డిసెంబర్లో తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ర్టాల్లోని విద్యార్థుల కోసం కెరీర్ మహోత్సవ్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రస్తుతం వీ-రీప్తో కలిసి కెరీర్ గైడెన్స్ ఇవ్వాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని అన్నారు.