మాయదారి కరోనా అన్నిరంగాలను చిదిమేస్తున్నది. నాలుగు చక్రాలు తిరిగితేనే పూట గడిచే క్యాబ్ డ్రైవర్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఐటీ ఉద్యోగులు ఏడాదిగా ఇంటి నుంచే పని కొనసాగిస్తుండడం, ఇటీవల పరిస్థితులు కుదుటపడుతున్నాయనుకునే లోపే మళ్లీ సెకండ్ వేవ్ ప్రభావంతో క్యాబ్లకు గిరాకీ బాగా పడిపోయింది. ప్రయాణాలు తగ్గుముఖం పట్టడం, వివాహాది శుభకార్యాలు లేకపోవడంతో గతంలో మాదిరి బుకింగ్లు రావడం లేదని క్యాబ్ల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటిపై ఆధారపడిన డ్రైవర్లు ఉపాధి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. గ్రేటర్వ్యాప్తంగా అన్నిరకాల క్యాబ్లు కలిపి 80 వేల వరకు ఉండగా, నెలరోజుల్లో 30 వేల క్యాబ్లు యాప్ల నుంచి బయటకొచ్చినట్లు వాహన సంఘాల నాయకులు తెలిపారు.
క్యాబ్లకు కరోనా బ్రేకులు వేసింది.. వైరస్ ఉధృతితో ఓలా, ఉబర్ యాప్ ఆధారిత వాహనాల రాకపోకలు తగ్గాయి. గ్రేటర్లో సుమారు 80 వేల క్యాబ్లు సర్వీస్లు అందించగా.. సెకెండ్ వేవ్ ఇటీవల పుంజుకోవడంతో నెలరోజుల్లో ఏకంగా 30 వేల వాహనాలు సర్వీస్ నుంచి బయటకు వచ్చాయని వాహన సంఘాల నాయకులు తెలిపారు. గతంలో మాదిరిగా ప్రస్తుతం బుకింగ్స్లేక డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. వర్క్ఫ్రం హోంతో ఇప్పుడు వారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.. అలాగే ఎలాంటి గిరాకీలు లేక మ్యాక్సీ క్యాబ్, మినీ బస్సుల పరిస్థితి మరింత దారుణంగా మారింది.
కరోనా సెకండ్ వేవ్ విజృంభణ ప్రభావం క్యాబ్ డ్రైవర్లను కుదుపేసింది.. వైరస్ ఉధృతితో ప్రయాణాలు తగ్గుముఖం పట్టడంతో గతంలో మాదిరిగా బుకింగ్స్ రావడం లేదని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఐటీ కారిడార్, ఎయిర్పోర్టు కారిడార్లో నిత్యం వేలాది వాహనాలు ట్రిప్పులు సాగిస్తాయి. వర్క్ఫ్రమ్ హోంతో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో క్యాబ్ డ్రైవర్లు ఉపాధి కోసం ప్రత్నామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నారు. అలాగే.. మ్యాక్సీ క్యాబ్, మినీ బస్సుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఎటువంటి గిరాకీలు లేక వాటి యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో మాదిరిగా వేడుకలు, టూర్లు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వాటి వినియోగం తగ్గింది.
నిత్యం లక్షలాది మంది ఉద్యోగులతో సందడిగా ఉండే ఐటీ కారిడార్.. వర్క్ ఫ్రమ్ హోంతో కళ తప్పింది. ఉద్యోగులను నమ్ముకుని ఉపాధి సాగిస్తున్న క్యాబ్ డ్రైవర్లకు గడ్డు పరిస్థితులు వచ్చాయి. ప్రతిరోజూ ఐటీ కారిడార్కు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 30 వేల క్యాబ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రస్తుతం వాటి సంఖ్య రెండు వందలకు మించడం లేదని క్యాబ్స్, డ్రైవర్స్ అసోసియేషన్ వెల్లడించింది. గత ఏడాది లాక్డౌన్ నుంచి ప్రైవేట్ వాహనాలకు ఇదే పరిస్థితి ఎదురవుతోంది. ప్రజలు ఎక్కువగా ప్రజా రవాణాను తగ్గించారు. వ్యక్తిగత ప్రయాణాలకు ఆసక్తి చూపిస్తున్నారు. కరోనా ప్రబలుతుండటంతో సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయడానికి జంకుతున్నారు. మరికొందరు సొంత వాహనాలను వాడుతున్నారు. సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసుకుంటున్నారు. మొత్తంగా కరోనా సెకండ్ వేవ్తో వాహనాలపై ఆధారపడిన డ్రైవర్ల ఉపాధికి గండి పడింది.
కేంద్ర ప్రభుత్వం నిర్వాకం వల్ల పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో డ్రైవర్లకు ఇబ్బందులు వచ్చాయి. ఈఎంఐలు చెల్లించలేక చాలామంది ట్రాన్స్పోర్ట్ వృత్తినే వదిలేస్తున్నారు. నగరంలో టూరిజం ప్రయాణాలు తగ్గిపోయాయి. ఐటీపై ఆధారపడిన డ్రైవర్లకు గిరాకీ లేదు. – షేక్ సలావుద్దీన్, చైర్మన్, క్యాబ్ అండ్ టాక్సీ డ్రైవర్స్ జాక్
ఐటీ సెక్టార్ మొత్తం వర్క్ ఫ్రమ్ హోంకు మారిపోయింది. గిరాకీ లేదు. క్యాబ్ను వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈఎంఐలు చెల్లించలేకపోతున్నాం. వాహనం కొనుగోలుకు తీసుకున్న అప్పులను చెల్లించడం భారంగా మారింది. ఈ పరిస్థితుల్లో కుటుంబాన్ని చూసుకోవడం కష్టంగా మారింది. చాలా మంది డ్రైవర్లకు పస్తులుండాల్సిన దుస్థితి వచ్చింది. – ముక్తర్ అహ్మద్, డ్రైవర్