తెలుగుయూనివర్సిటీ, జూలై 29: తెలుగు సాహిత్యాన్ని అన్ని కోణాల్లో సృశించిన జ్ఞానపీఠ పురస్కారగ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి తెలుగు సాహిత్య కిరణమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అభివర్ణించారు. తెలంగాణ సారస్వత పరిషత్తు, సుశీలా నారాయణరెడ్డి ట్రస్టు సంయుక్తాధ్వర్యంలో సినారె 90వ జయంతిని డాక్టర్ దేవులపల్లి రామానుజరావు కళామందిరంలో గురువారం నిర్వహించారు. ముందు గా సినారె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి నిరంజన్రెడ్డి హాజరై ప్రసంగించారు. సినారె చట్టసభల్లో 624 ప్రశ్నలు వేసి సభికుల ప్రశంసలు అందుకున్నారని గుర్తు చేశారు. 1960లోనే రామప్ప పేరుతో అద్భుతమైన రూపకం రాశారని వివరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ సినారె సినీగీత సర్వస్వం 7వ సంపుటిని మంత్రి, 7పాటల వివరాలతో కూడిన అనుక్రమణికను సుప్రీంకోర్టు పూర్వన్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆవిష్కరించారు. పరిషత్తులో నెలకొల్పడానికి రూపొందించిన సినారె నిలువెత్తు తైలవర్ణ చిత్రాన్ని శాంతా బయోటెక్ అధినేత డాక్టర్ కె.ఐ వరప్రసాదరెడ్డి ఆవిష్కరించి చిత్రకారుడు జె.వి.ని సత్కరించారు. పరిషత్తు ప్రతియేటా అందజేస్తున్న సినారె సాహితీ పురస్కారాన్ని సిరిసిల్లకు చెందిన ప్రముఖ కవి జూకంటి జగన్నాథంకు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యాల యం ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్, పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె.చెన్నయ్య, కోశాధికారి రామారావు, సినారె కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
చిక్కడపల్లి, జూలై 29: కవిగా, రచయితగా కొనసాగిన డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన మహనీయుడు అని రాష్ట గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ అన్నారు. గురువారం చిక్కడపల్లిలోని నగర గ్రంథాలయంలో సంస్థ చైర్పర్సన్ ప్రసన్న రామ్మూర్తి ఆధ్వర్యంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి. నారాయణరెడ్డి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయచితం శ్రీధర్ సినారె చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నగర గ్రంథాయల సంస్థ కార్యదర్శి పి. పద్మజ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగుయూనివర్సిటీ, జూలై 29: కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో జ్ఞానపీఠ పురస్కారగ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి 90వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ సారస్వత పరిషత్తులో గురువారం అక్షర తపస్వీ ఆచార్య ఎస్వీ రామారావు రచించిన తెలంగాణ సాహిత్య విమర్శ చరిత్ర, భారతీయ సాహిత్య నిర్మాతలు-సి.నారాయణరెడ్డి గ్రంథాల ఆవిష్కరణ సభ జరిగింది. పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి ముఖ్య అతిథిగా పాల్గొని తెలంగాణ సాహిత్య విమర్శ చరిత్ర గ్రంథాన్ని, ప్రముఖ రచయిత కె. శివారెడ్డి భారతీయ సాహిత్య నిర్మాతలు-సి.నారాయణరెడ్డి గ్రంథాలను ఆవిష్కరించారు. సాహితీవేత్త డాక్టర్ ఓలేటి పార్వతీశం, పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య, కిన్నెర కార్యదర్శి మద్ధాళి రఘురామ్ తదితర సాహితీవేత్తలు పాల్గొని సినారె సాహిత్య వ్యక్తిత్వాన్ని కొనియాడారు. ప్రముఖ గాయకులు వై.ఎస్ రామకృష్ణ సమర్పణలో డాక్టర్ సినారె సినీ సం గీత విభావరిలో భాగంగా పలువురు గాయనీ గాయకులు ఆణిముత్యాల్లాంటి గీతాలను గానం చేసి ఆహుతులకు పంచారు.