అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు
బందోబస్తు నిర్వహించిన పోలీసులు
మామిళ్లగూడెం/ వ్యవసాయం, మే 3: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ సోమవారం నగరంలో ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ కళాశాలలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్, సీపీ విష్ణు ఎస్ వారియర్ ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియను పూర్తి చేశారు. పోటీ చేసిన అభ్యర్థులతోపాటు వారి ఏజెంట్లను సైతం కొవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ ఉంటేనే కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించారు. మొత్తం 60 డివిజన్లకు గానూ 10 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి లెక్కింపు నిర్వహించారు. కొవిడ్ నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేశారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రతి ఒక్కరూ డబుల్ మాస్కులతో పాటు గ్లవ్స్, ఫేస్షీల్డ్లు ధరించారు. భౌతిక దూరం సైతం పాటించారు.
పూర్తి స్థాయిలో ఏర్పాట్లు..
కౌంటింగ్ కేంద్రం వద్దకు వచ్చిన అన్ని పార్టీల అభ్యర్థులతోపాటు సిబ్బందికీ ఎలాంటి అసౌకర్యమూ కలుగకుండా ఏర్పాట్లు చేశారు. వేసవి కావడం, ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతుండడం వంటి కారణాలతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా కేంద్రం వద్ద భారీ టెంట్లు వేశారు. కౌంటింగ్కు హాజరైన అభ్యర్థులకు తాగునీరు అందించారు. ఎయిర్ కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేసి ఉక్కపోత నుంచి ఉపశమనానికి ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగిన ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టారు.
పోలీసుల బందోబస్తు..
కేఎంసీ ఎన్నికల ఫలితాల లెక్కింపు సందర్భంగా పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు నిర్వహించారు. లెక్కింపు సమయంలో కౌంటింగ్ కేంద్రంలో ఘర్షణలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సీపీ విష్ణు ఎస్ వారియర్ ప్రతి గంటకూ పోలింగ్ కేంద్రంలోకి వచ్చి లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి కౌంటింగ్ను సజావుగా పూర్తి చేయించారు.