ఉస్మానియా యూనివర్సిటీ : ఎమ్మెల్యే బాల్క సుమన్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి దిష్టిబొమ్మను శుక్రవారం దహనం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమాన్ని వెక్కిరించిన ఊసరవెల్లి జగ్గారెడ్డి అని మండిపడ్డారు.
రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో సమైక్య రాష్ట్రమే ముద్దంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాడి ఎంతో మంది బలిదానాలకు కారకుడయ్యాడని దుయ్యబట్టారు. వసూలు రాజాలను వెనకేసుకుని ఉద్యమ శక్తులపై మొరుగుతున్నాడని నిప్పులు చెరిగారు. ఉద్యమం ఎత్తిపట్టిన అగ్గి బరాటా ఎమ్మెల్యే బాల్క సుమన్ అని అన్నారు.
సూర్యుడికి మసిపూయడం సాధ్యం కాదని కాంగ్రెస్ దద్దమ్మలు తెలుసుకోవాలని హితవు పలికారు. తెలంగాణ యువకుల నెత్తురు తాగిన నికృష్టులు కాంగ్రెస్ వాళ్లని ఎద్దేవా చేశారు. దేశాన్ని దరిద్రంలోకి నెట్టిందే జాతీయ పార్టీలని విమర్శించారు. దేశమే చీకొట్టిన రాహుల్గాంధీకి ఉస్మానియా యూనివర్సిటీలో ఏం పని అని ప్రశ్నించారు. పాతసినిమాలలో విలన్ రామిరెడ్డి లాంటోడు జగ్గారెడ్డి అని అన్నారు.
జగడాలమారిగా మారి జనాలపై వాలిన రాబందుగా జగ్గారెడ్డిని అభివర్ణించారు. ఓయూజేఏసీ పేరుతో చెలామణి అవుతున్న వసూళ్ల ముఠాను వంగబెట్టి దంచుతామని హెచ్చరించారు. టీఆర్ఎస్ నాయకులపై అవాక్కులు చవాక్కులు పేలుతున్న వారిని ఇకపై ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఇప్పటికైనా అలాంటివారు తమ వైఖరిని మార్చుకోవాలని హితవు పలికారు. లేనిపక్షంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు బండారి వీరబాబు, ఆవాల హరిబాబు, జీడి అనిల్, పెద్దమ్మ రమేశ్, కోతి విజయ్, శిగ వెంకట్, రఘురాం, శశిపాల్, రాజేశ్, జంగయ్య, వినోద్, రమేశ్, రామకృష్ణ, బాలు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.