మేడ్చల్, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వరి కోతలు ప్రారంభమైన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా 12 కొనుగోలు కేంద్రాలను ఈనెల 16న ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మార్క్ఫెడ్, పౌరసరఫరాలు, వ్యవసాయ, లీగల్ మెట్రాలజీ శాఖల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు చేయనున్నారు. జిల్లావ్యాప్తంగా 13,579 ఎకరాలలో వరి సాగు చేయగా 33,948 మెట్రిక్ టన్నుల దిగుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాట్లను అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
జిల్లావ్యాప్తంగా పండిన వరిని పూర్తిగా కొనుగోలు చేసి మద్దతు ధర అందించనున్నారు. జిల్లాలోని 11 మండలాలలో 8,678 మంది రైతులు వరి సాగు చేయగా.. అధికంగా సాగైన గ్రామాల్లో సబ్ కేంద్రాల ద్వారా కొనుగోళ్లు జరుపనున్నారు. ఇప్పటికే అదనపు కలెక్టర్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించి.. ధాన్యం విక్రయించే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు.