చార్మినార్, జూన్ 23: బోనాల పండుగను ఘనంగా నిర్వహించడానికి జీహెచ్ఎంసీ తగిన ఏర్పాట్లను పూర్తి చేస్తుందని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. హరిబౌలిలోని చారిత్రక అక్కన్న మాదన్న దేవాలయంలో బోనాల అంకురార్పణలో భాగంగా ఆలయ ధ్వజారోహణాన్ని శుక్రవారం నిర్వహించారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజాధి కార్యక్రమాలను నిర్వహించిన మేయర్ విజయలక్ష్మికి ఆలయ పూజారు తీర్థ ప్రసాదాలను అందించి, అమ్మవారి ఆశీర్వచనాలను అందించారు. అనంతరం, అక్కన్న మాదన్న ఆలయం ఆధ్వర్యంలో కరోనా మహమ్మారిని తరిమివేయడానికి సంకల్పించిన అమ్మవారి లక్ష కుంకుమార్చన కార్యక్రమంలో మేయర్ స్థానిక మహిళలలతో కలిసి పాల్గొన్నారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలను అంగరంగ వైభవంగా నిర్వహించడానికి పూర్తిస్థాయి సహాయ సహకారాలను ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. అదే సమయంలో జీహెచ్ఎంసీ సైతం పాత నగరంలోని ఉమ్మడి దేవాలయాల కమిటీలో గుర్తించిన పెద్ద దేవాలయాల వద్ద భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనుందని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు జి.రాజరత్నం, ప్యాట్రన్ జి.నిరంజన్, కార్యదర్శి దత్తాత్రేయ, కోశాధికారి ఏ.సతీష్ కుమార్, సభ్యులు ఏ.భరత్ ప్రకాష్, రాందేవ్ అగర్వాల్, ఎం.కృష్ణ, చేతన్ సూరి, ఎస్పీ క్రాంతి కుమార్, జి.శ్రీనివాస్, ఎ.గోపాల్, జి.రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.