మల్కాజిగిరి, జూలై 25: గోల్కొండ, సికింద్రాబాద్ బోనాల జాతర తర్వాత నిర్వహించే అత్యంత ప్రసిద్ధి చెందిన మల్కాజిగిరి శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు అన్ని ఆలయాలు ముస్తాబవుతున్నాయి. వచ్చే ఆది, సోమ వారాల్లో నిర్వహించే జాతరకు సంబంధించి ఇప్పటి నుంచే ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మల్కాజిగిరి పరిధిలోని ఉజ్జయినీ మహంకాళి, ఆర్కేనగర్లోని బందరుపోచమ్మ, సఫిల్గూడలోని విజయదుర్గ కట్టమైసమ్మ, గౌతంనగర్లోని అంబా భవానీ, పాత మల్కాజిగిరిలోని నల్లపోచమ్మ, తదితర ఆలయాలన్ని ఇప్పటికే రంగులతో తీర్చిదిద్దుతున్నారు. బోనాల నాటికి భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా, సోమవారం అమ్మవారి రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి దేవాలయ ఆవరణలో రంగం (అమ్మవారు) ఆవహించిన వ్యక్తి భవిష్యవాణిని వినిపిస్తారు. ఈ కార్యక్రమానికి అధికంగా భక్తులు హాజరవుతారు.
ఆగస్టు 1 న ఆదివారం బోనాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు పెద్ద ఎత్తున ఆలయ నిర్వాహకులు, పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు క్యూ లైన్లు, ప్రత్యేక దర్శనం లైన్లు, ఆలయాల వద్ద ఉచిత వైద్య శిబిరాలకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు.
మారేడ్పల్లి/ కంటోన్మెంట్/వినాయక్నగర్ జూలై 25: సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి జాతరను పురస్కరించుకొని మోండా డివిజన్లోని పలు ఆలయాల్లో బోనాల ఉత్సవాలు వైభవంగా ఆదివారం జరిగాయి. డివిజన్ పరిధిలోని రెజిమెంటల్ బజార్లోని గండిమైసమ్మ అమ్మవారి ఆలయం, జూలమ్మ ఆలయం, సెకండ్బజార్లో ముత్యాలమ్మ, ఆదయ్యనగర్లోని ఏడు గుళ్ల ఆలయం తదితర ప్రాంతాల్లో బోనాలు కనుల పండువగా జరిగాయి. ఉదయం నుంచి భక్తులు అమ్మవారికి బోనం సమర్పించుకుంటూ తమ తమ మొక్కులను చెల్లించుకున్నారు.
గండి మైసమ్మ ఆలయంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, బోయిన్పల్లి మార్కెట్ యార్డులోని అమ్మవారి ఆలయంలో మార్కెట్ యార్డు చైర్మన్ టీఎన్. శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గోపాలపురం పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహించారు.
అమ్మవారి దీవెనలు అందరికి ఉంటాయని కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి అన్నారు. ఆదివారం సికింద్రాబాద్లోని ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి కార్పొరేటర్ పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రుద్ర, మహేశ్వరి, సుశీల, రీతు, అంజలి, తిరుమల, జ్యోతిర్మయి, మేఘన, మానస, ఉమా మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.