హైదరాబాద్ : కొవిడ్ మహమ్మారి సమయంలో రక్త అవసరాలు నెరవేరే ప్రయత్నంలో తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (ట్రెడా) ఆదివారం నగరంలోని మియాపూర్లో గల ఎస్ఎంఆర్ వినయ్ సిటీలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఈ రక్తదాన శిబిరానికి హాజరయ్యారు. గేటెడ్ కమ్యూనిటీ నివాసితులు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
ఎస్ఎంఆర్ వినయ్ సిటీ, ట్రెడా, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్, సేవా భారతి సహకారంతో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. గేటెడ్ కమ్యూనిటీకి చెందిన పలువురు నివాసితులు రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారు. ట్రెడా వైస్ ప్రెసిడెంట్ మేకా విజయ్ సాయి మాట్లాడుతూ.. ట్రెడాతో సంబంధం ఉన్న ప్రతి గేటెడ్ కమ్యూనిటీలో తాము రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రక్తదానం చేసేందుకు అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.