సిటీబ్యూరో, జులై 8(నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. తలసీమియా వ్యాధిగ్రస్తుల కోసం రక్తదానం చేశారు. నిలోఫర్ దవాఖాన, తలసీమియా సొసైటీల ఆధ్వర్యంలో నగర ట్రాఫిక్ అదనపు కమిషనర్ అనిల్ కుమార్ నేతృత్వంలో గురువారం లోయర్ ట్యాంక్బండ్లోని పింగళి వెంకట్రామిరెడ్డి గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరాన్ని సీపీ అంజనీకుమార్ ప్రారంభించారు. తలసీమియా వ్యాధిగ్రస్తులకు అవసరమైన రక్తాన్ని అందించేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు తమ వంతు ప్రయత్నంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ శిబిరంలో 253 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో డీసీపీలు ఎల్ఎస్ చౌహాన్, కరుణాకర్, నిలోఫర్ వైద్యులు లోక భరణి, తలసీమియా సొసైటీ ప్రతినిధులు దుర్గా తదితరులు పాల్గొన్నారు.