అబిడ్స్, ఆగస్టు 10: గ్యాస్ రీఫిల్లింగ్ కేంద్రంలో పేలుడు సంభవించి ఓ యువకుడు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళ్హాట్ పోలీస్స్టేషన్ పరిధి ఠక్కెర్వాడీ ప్రాంతంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. ఠక్కెర్వాడీ ప్రాంతంలో వీరుసింగ్(50), సుచిత్రబాయి (45), మానవ్సింగ్ (22), షేరాసింగ్ (24)లు నివసిస్తుండగా.. ఇందులో గతంలో ఆటో నడిపే వీరుసింగ్ అక్రమ గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తున్నాడు. పెద్ద సిలిండర్ల నుంచి గ్యాస్ను చిన్న సిలిండర్లలో నింపుతూ విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం గ్యాస్ రీ ఫిల్లింగ్ చేస్తుండగా పేలుడు సంభవించింది. ఆ మంటలు మరో సిలిండర్కు అంటుకోగా ఓ స్థానికుడు ఆ సిలిండర్ను రోడ్డుపైకి తీసుకురాగా అక్కడే పేలిపోయింది. దీంతో మానవ్సింగ్(22) అక్కడికక్కడే మృతి చెందగా.. వీరుసింగ్, సుచిత్రబాయి, షేరాసింగ్కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, గోషామహల్ ఏసీపీ ఎం. నరేందర్రెడ్డి, మంగళ్హాట్ ఇన్స్పెక్టర్ జి.రణవీర్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీశారు. మృతి చెందిన మానవసింగ్ను ఉస్మానియాకు తరలించి కేసును దర్యాప్తు చేస్తున్నారు.