బంజారాహిల్స్,మే 13: అతడు బ్లాక్మెయిలర్.. ఫోన్లు చేయడం.. వారి మాటలు రికార్డింగ్స్ చేయడం.. ఏదో ఒకమాట పట్టుకుని కేసులు పెడతానంటూ బెదిరింపులకు గురిచేయడం అతని నైజం.. రెండు తెలుగు రాష్ర్టాల్లో సుమారు 12కి పైగా చీటింగ్ కేసులు, బ్లాక్మెయిల్ కేసులు ఉన్నాయి. తాజాగా మరో కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తుండటంతో అతడిపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదయింది. దాంతో అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులను బెదిరింపులకు గురిచేసేందుకు సెల్ఫీ వీడియోలు తీసి.. తనను చంపేందుకు వచ్చారంటూ సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు సుమారు 21 గంటల పాటు ముప్పుతిప్పలు పెట్టాడు. పోలీసులు రాత్రంతా వేచి ఉండి గురువారం ఉదయం చాకచక్యంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడకు చెందిన అట్లూరి సురేశ్(32) జూబ్లీహిల్స్ రోడ్ నం.22లో నివాసం ఉంటున్న ఓ కుటుంబంతో రెండేండ్ల క్రితం పరిచయం ఉంది. వారికి సంబంధించిన ఓ సమస్యను పరిష్కరించాడు. ఆ తర్వాత వారికి ఫోన్లు చేయడంతో పాటు వేధింపులకు గురిచేస్తున్నాడు. మెసేజీలు పెడుతూ అసభ్యకరంగా మాట్లాడుతుండటంతో బాధితులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడు అట్లూరి సురేశ్పై ఐపీసీ 354(డీ), 389,509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
కాగా.. ఈ కేసులో నిందితుడు సురేశ్ను అరెస్ట్ చేసేందుకు బుధవారం ఉదయం 11గంటల ప్రాంతంలో పోలీసులు మాదాపూర్లో అతడు నివాసముంటున్న అపార్ట్మెంట్కు వెళ్లారు. గమనించిన సురేశ్ ఇంట్లోకి వెళ్లి తాళం వేసుకున్నాడు. సాయంత్రం అయినా తలుపులు తీయకపోవడంతో పాటు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు హైడ్రామాకు తెరతీశాడు. తనను చంపేందుకు కొంతమంది పోలీసులు వచ్చారని, ఏ కేసు చెప్పకుండా తన ఇంటిచుట్టూ మోహరించారని, వారివద్దనుంచి తనకు ప్రాణహాని ఉందంటూ సెల్ఫీ వీడియోలు తీసుకుని.. వాటిని సోషల్మీడియాలో పోస్ట్ చేశాడు. రాత్రంతా అక్కడే జాగారం చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు గురువారం ఉదయం హైడ్రామాకు తెరదించుతూ ఇంట్లోకి వెళ్లి అతడిని అదుపులోకి తీసుకుని పీఎస్కు తరలించారు. అతడిపై రెండు తెలుగు రాష్ర్టాల్లోని వివిధ పోలీస్స్టేషన్ల పరిధిలో సుమారు 12కి పైగా కేసులు నమోదు అయినట్లు తేలింది.