సిటీబ్యూరో, అక్టోబర్ 20(నమస్తే తెలంగాణ): రూ. 5 లక్షలు ఇవ్వకుంటే సోషల్ మీడియాలో ఫొటోలను పెట్టి బద్నామ్ చేస్తానని ఓ మహిళను వేధిస్తున్న ప్రైవేటు ఉద్యోగిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..ఓ మహిళకు సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోలు, ఫొటోలు వాట్సాప్లో గుర్తు తెలియని వ్యక్తి షేర్ చేస్తున్నాడు. ఇవి సోషల్ మీడియాలో రాకుండా ఉండాలంటే రూ. 5 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాడు.
ఈ బ్లాక్మెయిలింగ్తో భయాందోళనకు గురైన బాధితురాలు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేసిన పోలీసులు..నిందితుడు తమిళనాడు రాష్ట్రం వెల్లురు ప్రాంతానికి చెందిన కాబిలన్గా గుర్తించి అరెస్టు చేశారు. విచారణలో కాబిలన్ బాధితురాలి ఇంటి పక్కన ఉన్నప్పుడు ఆమెను లొంగదీసుకుని వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. ఆ సమయంలో తీసుకున్న వీడియోలు, ఫొటోలను దాచిపెట్టుకుని ఇప్పుడు వాటితో బెదిరించడం మొదలుపెట్టాడు. ఇలా భయపెట్టి డబ్బులు వసూలు చేయాలని ప్లాన్ చేసినట్లు కాబిలన్ పోలీసులకు తెలిపాడు.