సిటీబ్యూరో, మే 24(నమస్తే తెలంగాణ): విలాసాలకు అలవాటు పడిన ఓ యువతి బ్లాక్మెయిల్ చేస్తూ రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు దొరికిపోయింది. హయత్నగర్, బండ్లగూడ ప్రాంతానికి చెందిన నేహ అలియాస్ బ్లెస్సీ ఓ బహుళజాతి సంస్థలో టీమ్ లీడర్గా పని చేస్తుంది. అయితే..అత్యంత విలాసవంతమైన అలవాట్లకు బానిసై ఉద్యోగాన్ని కోల్పోయింది. నాగోల్లో జిమ్కు వెళ్తున్న సమయంలో ఆమెకు ఓ ప్రభుత్వ ఉద్యోగి పరిచయమయ్యాడు. అతను వివాహం కాలేదని చెప్పడంతో.. నేహ అతనితో స్నేహం చేసింది. కొద్ది రోజుల తర్వాత అతనికి వివాహం అయ్యిందని తెలుసుకుంది.. దీంతో కోపం పెంచుకున్న ఆ యువతి.. అతనిపై ఎల్బీనగర్ పీఎస్లో తప్పు డు కేసు పెట్టింది. ఆ తర్వాత అతని భార్య, కుటుంబ సభ్యుల వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించి ఇన్స్టాగ్రామ్, ఫేసుబుక్ లలో నకిలీ ఐడీలను రూపొందించి.. అతనితో వివాహేతర సంబంధం ఉందని ప్రచారం చేసింది. దీన్ని ఆపాలంటే డబ్బులు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసింది. దీంతో ఆ ప్రభుత్వ ఉద్యోగి భార్య రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన అధికారులు నేహను సోమవారం అరెస్ట్ చేశారు.