ప్రభుత్వ ఆయుర్వేద దవాఖానా సీనియర్ ప్రొఫెసర్, డాక్టర్ యశోద
వెంగళరావునగర్, మే 26: కరోనా సోకి తగ్గిన వారిలో తీవ్ర ముప్పుగా మారిన బ్లాక్ ఫంగస్ (మ్యూకర్ మైకోసిస్) ను ఆయుర్వేద మందులతో పూర్తిగా నయం చేయవచ్చని ప్రభుత్వ ఆయుర్వేద దవాఖాన సీనియర్ ప్రొఫెసర్, మెడిసిన్ ఇన్చార్జి డాక్టర్ పి.యశోద తెలిపారు. వెంగళరావునగర్ డివిజన్ పరిధిలోని డాక్టర్ బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల ప్రాంగణంలో వారం రోజులుగా బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉచితంగా ఆయుర్వేద మందులను పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఆయుర్వేద వైద్య విధానం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. కరోనా లాంటి ప్రాణాంతక వ్యాధి నుంచి కోలుకున్నవారు ఈ మందులను వినియోగించాల్సి ఉంటుందన్నారు.
ఇందులో ‘సంశమనవటి, నిశామలకపటి, సుదర్శన ఘనపటి’ ఔషధాలను ఆయుర్వేద వైద్య నిపుణుల సూచన మేరకు వాడితే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. వారం రోజుల నుంచి ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దాదాపు 150-200 వరకు రోగులకు ఆయుర్వేద మందులను ఉచితంగా అందజేస్తున్నట్లు తెలిపారు. కరోనా వచ్చి తగ్గిన వారు ఈ ఆయుర్వేద మందులను మూడు వారాల పాటు వాడితే బ్లాక్ ఫంగస్ నుంచి పూర్తిగా కోలుకునే అవకాశం ఉందన్నారు. ఆయుర్వేద మందుల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవన్నారు. కార్యక్రమంలో ఆయుర్వేద దవాఖాన సూపరింటెండెంట్ రామచంద్రారెడ్డితో పాటుగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీకాంత్బాబు, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ ఉమా శ్రీనివాస్, డాక్టర్ రమాదేవి, డాక్టర్ లక్ష్మీకాంత్, డాక్టర్ లహరి తదితరులు పాల్గొన్నారు.