బంజారాహిల్స్, ఆగస్టు 12: పార్టీ ఒక్కటే.. కానీ వర్గాలు వేరు… పార్టీ ఎమ్మెల్యే ఓ వైఖరి ప్రకటిస్తే.. అదే పార్టీకి చెందిన కార్పొరేటర్ దానికి విరుద్ధమైన వైఖరితో తిరుగుబాటు జెండా ఎగురవేశాడు. జూబ్లీహిల్స్ డివిజన్, ఫిలింనగర్లోని అభయాంజనేయ స్వామి ఆలయ వ్యవహారం బీజేపీలో చిచ్చురేపింది. స్థానిక కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్, గత ఎన్నికల్లో టిక్కెట్ ఆశించి భంగపడ్డ పల్లపు గోవర్ధన్ వైరం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను నవ్వులపాలు చేసింది. ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం విక్రయించిన స్థలంలో ఉన్న అభయాంజనేయ స్వామి ఆలయాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కొంత మంది బీజేపీ అసమ్మ తి నాయకులు ప్రచారం చేశారు. కాగా.. ధూప, దీపాలకు నోచుకోని కొండపైన ఉన్న ఆలయాన్ని దిగువన ఉన్న 700 గజాల స్థలంలో నిర్మించేందుకు బీజేపీ కార్పొరేటర్ వెంకటేశ్తో పాటు ఫిలింనగర్ బస్తీవాసులు అంగీకరించారు.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఆలయ పునర్నిర్మాణ పనులకు స్థానిక టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు ఫిలింనగర్ 18 బస్తీలకు చెందిన స్థానికుల ఆధ్వర్యంలో భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కార్పొరేటర్ వెంకటేశ్ కూడా హాజరయ్యారు. ఇదిలా ఉండగా ఈ వ్యవహారం గురించి సరైన అవగాహన లేకుండా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడికి చేరుకొని హంగామా చేశారు. కొండపైన ఉన్న విగ్రహాన్ని తొలగిస్తే చేతులు నరికేస్తామంటూ అక్కడే ఉన్న బీజేపీ కార్యకర్తల వద్ద వ్యాఖ్యానించడం వివాదానికి దారి తీసింది.
బస్తీవాసుల అభీష్టం మేరకు ఆలయాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నామని, సరైన సమా చారం లేకుండా ఎందుకు వచ్చారంటూ బీజేపీ కార్పొరేటర్ వెంకటేశ్తో పాటు పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, ఫిలింనగర్ బస్తీవాసులు రాజాసింగ్ను అడ్డుకొ ని నిలదీశారు. ఈ పంచాయితీ బీజేపీ జిల్లా పార్టీ పెద్దల వద్దకు చేరుకుంది. ఒకే పార్టీలో ఉంటూ పరస్పర విరుద్ధ వాదనలకు దిగుతుండటం సరికాదంటూ రెండు వర్గాలకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేసినట్లు తెలుస్తుంది. మొత్తం మీద ఫిలింనగర్ గుడి వ్యవహారం బీజేపీలో చిచ్చురేపిందని స్థానికులు అభిప్రాయప డుతున్నారు.