సిటీబ్యూరో, జూలై 24(నమస్తే తెలంగాణ): బిట్ కాయిన్లు విక్రయిస్తానని మోసం చేసిన ఓ వ్యక్తిని హైదరాబాద్ సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం, బెంగళూరుకు చెందిన అక్షయ్ గౌడ బినాన్స్, జ్రిక్స్ వెబ్సైట్ల ద్వారా బిట్ కాయిన్ ట్రేడర్స్మని పరిచయం చేసుకుని, ఆ తర్వాత వారి నమ్మకాన్ని గెల్చుకోవడానికి బిట్ కాయిన్ను విక్రయిస్తాడు. అలా నమ్మకాన్ని గెల్చుకున్న తర్వాత తన దగ్గర బిట్ కాయిన్లను కొంటే భారీ కమిషన్లు ఇస్తామని బోల్తా కొట్టిస్తాడు. భారీగా డబ్బులు వసూలు చేసిన తర్వాత బాధితుల ఫోన్లకు స్పందించడు. ఇలా హైదరాబాద్కు చెందిన మనీష్ రెడ్డిని నమ్మించి అతని నుంచి రూ.3.14 లక్షలను కాజేశాడు. ఈ మేరకు ఆయన ఫిర్యాదుపై సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు అక్షయ్ గౌడను అరెస్టు చేశారు.