మెహిదీపట్నం జూలై 12: యూట్యూబ్లో వీడి యోలు చూసి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు యువకులు ఎట్టకేలకు కటకటాలపాలయ్యారు. పశ్చిమ మండలం డీసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాయింట్ కమిషనర్, డీసీపీ ఏఆర్.శ్రీనివాస్, ఆసిఫ్నగర్ ఏసీపీ ఆర్జీ. శివమారుతి, ఇన్స్పెక్టర్ రవీందర్, అదనపు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన శివరాత్రి చందు, చింతగుంట శివనాగ తేజ స్నేహితులు. జల్సాలకు అలవాటుపడ్డ వీరు.. అవసరానికి సరిపడా డబ్బులు లేకపోవడంతో దొంగతనాలకు స్కెచ్ వేశారు. ఖరీదైన స్పోర్ట్స్ వాహనాలు టార్గెట్గా చేసుకొని ఆసిఫ్నగర్తో పాటు పలు ప్రాంతాల్లో ఎనిమిది వాహనాలను అపహరించి ఆంధ్రప్రదేశ్కు తరలించారు. అక్కడ గొల్ల మధుకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు.
గతనెల 25న ఆసిఫ్నగర్ పీఎస్ పరిధిలోని మెహిదీపట్నం పీవీ ఎక్స్ప్రెస్ వే పిల్లర్ 35 సమీపంలో ఉంటున్న అజీముల్లా షరీఫ్ తన ఇంటిముందు పార్కింగ్ చేసిన బైక్ చోరీకి గురైందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డీసీపీ ఏఆర్. శ్రీనివాస్, ఆసిఫ్నగర్ ఏసీపీ శివమారుతి ఆదేశాలతో ఇన్స్పెక్టర్ నాగం రవీందర్, అదనపు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పర్యవేక్షణలో క్రైం కానిస్టేబుళ్లు రామకృష్ణ, శ్రీకాంత్ రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దొంగతనాలకు పాల్పడింది గుంటూరు జిల్లాకు చెందిన శివరాత్రి చందు, శివనాగతేజగా గుర్తించారు. వారిచ్చిన సమాచారంతో వాహనాలు కొనుగోలు చేసిన గొల్ల మధును అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి ఎనిమిది ఖరీదైన స్పోర్ట్స్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకుని, వాహనాలు స్వాధీనం చేసుకోవడానికి కృషి చేసిన క్రైం కానిస్టేబుళ్లు రామకృష్ణ, శ్రీకాంత్ను డీసీపీ అభినందించారు.