మహమ్మారిపై పోరాటం చేస్తూనే.. సేవా స్ఫూర్తిని చాటుకుంటున్నది భారత్ సేవా సహకార్ ఫోరం. ఆపన్నులను ఆదుకుంటూ.. ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేస్తున్నది. చైర్మన్ బస్వరాజు శ్రీనివాస్ నేతృత్వంలోని బీఎస్ఎస్ఎఫ్.. తెలుగు రాష్ర్టాల్లో నిరంతర సేవా కార్యక్రమాలతో అందరి మనన్నలు పొందుతున్నది.
7,231 మంది బీఎస్ఎస్ఎఫ్ వలంటీర్లు పట్టణాలు, గ్రామాలు, బస్తీలు అనే తేడా లేకుండా పనిచేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సంస్థ ద్వారా 11,07,346 మాస్కులు, 2,14,813 శానిటైజర్లు, 6,765 ఫేస్ షీల్డ్స్, 3,121 ఎన్ 95 మాస్కులు పంపిణీ చేయగా, 23,400 మందికి అన్నదానం చేశారు. ఏడాది కాలంగా 60 క్వింటాళ్ల బియ్యం అందించారు. గాంధీ వైద్యశాలకు 14 కోల్డ్, హాట్ బ్లూస్టార్లు, పేదలకు 5200 మందికి దుస్తువులు, హాస్టళ్లలోని 520 మంది బాలికలకు నూతన ఫుట్ వేర్, 10,700 లీటర్ల జ్యూస్ బాటిళ్లు అందజేశారు. ఇలా ఏడాది కాలంగా సాగుతున్న సేవలతో పాటు తాజా కరోనా నేపథ్యంలోనూ బీఎస్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సేవలు కొనసాగుతున్నాయి.
నగరంలోని స్నేహపురికాలనీ కేంద్రంగా ఏర్పాటైన భారత్ సేవా సహకార్ ఫోరం ఆధ్వర్యంలో ఏడాది కాలంగా ఎంతో మంది అన్నార్తులకు నిత్యావసర వస్తువులు, సరుకులు, మాస్కులు, శానిటైజర్లు, ఫేస్ షీల్డ్లు పంపిణీ చేశారు. కరోనా సమయంలో నగరంతో పాటు వివిధ జిల్లాలు, ఏపీలోని ప్రధాన నగరాల్లో వలంటీర్ల ద్వారా ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్, జీహెచ్ఎంసీ, వాటర్వర్క్స్, రైల్వేస్, ఎలక్ట్రిసిటీ , బ్యాంకులు, రెవెన్యూ విభాగం, మీడియా, దేవాదాయ శాఖలోని ఉద్యోగులకు మాస్కులతో పాటు నిత్యావసర సరుకులు అందించారు. పీఎం కేర్స్కు, సేవా భారతి సంస్థ, ఏకలవ్య ఫౌండేషన్ సంస్థలకు తమ వంతుగా విరాళాలను కూడా అందించింది బీఎస్ఎస్ఎఫ్. తెలుగు రాష్ర్టాల్లో ఏడాది కాలంలో 412 కార్యక్రమాలు చేపట్టి.. సామాజిక సేవలను నిరంతరాయంగా కొనసాగిస్తున్నది.
ప్రపంచవ్యాప్తంగా వచ్చిన విపత్తు కరోనా. దీనిని ఎదుర్కొనేందుకు ప్రతి పౌరుడు సైనికుడిలా మారాలి. మా వంతుగా వలంటీర్ల సహాయంతో సేవా కార్యక్రమాలకు పెద్ద పీట వేశాం. ఏడాది కాలంగా కరోనాపై పోరాటం చేయడంతో పాటు ఆపన్నులను ఆదుకుంటున్నాం. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు అందించాం. రైతన్నకు అండగా ఉండేందుకు జిల్లాల్లో పలు కార్యక్రమాలు చేపట్టాం. మా వంతుగా సేవలు అందించేందుకు ఎల్లవేళలా ముందుంటాం. – బస్వరాజు శ్రీనివాస్ ( చైర్మన్, భారత్ సేవా సహకార్ ఫోరం)