సిటీబ్యూరో, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ): రాచకొండ స్పెషల్ అపరేషన్ టీం మంగళవారం ఓ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకుంది. నిర్వాహకుడితో పాటు నలుగురు పందెంరాయుళ్లను అరెస్టు చేసింది. పట్టుబడ్డ వారి నుంచి 15 లక్షల నగదు, లక్ష విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకుంది. ఎల్బీనగర్లోని రాచకొండ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేశ్ భగవత్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ కొత్తపేట్ ప్రాంతానికి చెందిన బైరకామల్ శ్రీధర్ కోఠిలో పుస్తకాల దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద సంబ్రమ్ రామాంజనేయులు పని చేస్తున్నాడు.
శ్రీధర్ వ్యాపారంతో పాటు గత ఏడాది నుంచి సొంతంగా క్రికెట్ బెట్టింగ్లు నిర్వహిస్తున్నాడు. తన ఇంట్లోనే ఓ ల్యాప్టాప్ ద్వారా ఆన్లైన్ క్రికెట్ యాప్లపై క్రికెట్ లైన్ గురు, క్రికెట్ ఎక్సేంజ్ వేదికగా బెట్టింగులను నడిపిస్తున్నాడు. ఈ బెట్టింగ్లకు సంబంధించి తనకు తెలిసిన వారితో పాటు తన దుకాణంలో పని చేసే రామాంజనేయులు ద్వారా వచ్చిన వారి నుంచి బెట్టింగులకు సంబంధించిన డబ్బులను వసూలు చేస్తున్నాడు.
గత కొద్ది రోజులుగా ప్రారంభమైన టీ-20 వరల్డ్ కప్ టోర్నమెంట్లోని ఇండియా-పాక్, స్కాట్ల్యాండ్-అఫ్గనిస్తాన్, మ్యాచ్లతో పాటు మంగళవారం జరుగనున్న వెస్టిండిస్-దక్షిణాఫ్రికా, పాకిస్తాన్-న్యూజిల్యాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్లపై కూడా బెట్టింగ్ రుసుం వసూలు చేశాడు. బెట్టింగ్కు సంబంధించిన నగదును ఆన్లైన్తో పాటు నేరుగా పందెంరాయుళ్ల నుంచే వసూలు చేస్తున్నాడు. పందెంరాయుళ్లకు వారి బెట్టింగ్ అప్షన్లను మార్చుకునేందుకు 6, 10, 15, 20 ఓవర్ల సమయంలో కూడా శ్రీధర్ అవకాశం కల్పిస్తుండటంతో చాలా మంది పందెంరాయుళ్లు పందెం కాశారు.
ఈ బెట్టింగ్లపై సమాచారం అందడంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రవికుమార్ నేతృత్వంలోని బృందం బైరామల్ శ్రీధర్ ఇంటిలో సోదాలు జరిపి బెట్టింగ్ గుట్టును బయటపెట్టింది. శ్రీధర్ నుంచి దాదాపు మొత్తం రూ.16 లక్షల విలువ చేసే నగదు, సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శ్రీధర్తో పాటు రామాంజనేయులు, పందెంరాయుళ్లు జాజుల రాములు గౌడ్, బోయినపల్లి చత్రపతి, గౌని కళ్యాణ్లను అరెస్టు చేశారు. ఈ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేసిన ఎస్ఓటీ సిబ్బందిని సీపీ అభినందించారు. సమావేశంలో ఎస్ఓటీ డీసీపీ సురేందర్రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.