మందమర్రిలో రెండు క్వింటాళ్లు..గుంట్లపేటలో 90కిలోలు స్వాధీనం
మందమర్రి, జూన్ 20 : పట్టణంలో నకిలీ పత్తి విత్తనాల స్థావరం పై మందమర్రి పోలీసులు దాడులు నిర్వహించారు. నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ. 5 లక్షల విలువైన సుమారు రెండు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో మందమర్రి సీఐ ప్రమోద్రావు, ఎస్ఐ ఎల్ భూమేశ్ వివరాలు వెల్లడించారు. మందమర్రి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్కు చెందిన గాలిపెల్లి రాజయ్య గుట్టుచప్పుడు కాకుండా నకిలీ పత్తి విత్తనాలను విక్రయిస్తున్నాడనే సమాచారంతో సిబ్బందితో కలసి తనిఖీలు చేశామని తెలిపారు. రాజయ్య ఇంట్లో నిల్వ ఉంచిన రూ.5 లక్షల విలువైన సుమారు రెండు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు లభించాయని పేర్కొన్నారు. రాజయ్యను అదుపులోకి తీసుకొని నకిలీ విత్తనాలను ఠాణాకు తరలించినట్లు వెల్లడించారు. రాజయ్యను విచారించగా నకిలీ పత్తి విత్తనాల వ్యాపారంతో సంబంధం కలిగి ఉన్న ఒకటో జోన్కు చెందిన ఎం.శ్రీనివాస్, పాత బెల్లంపల్లికి చెందిన పెట్టం రాజమల్లును అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ సహకారంతో అక్రమార్కులందరిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. అవసరమైతే పీడీ యాక్టుకు కూడా వెనుకాడేది లేదన్నారు. దాడిలో పాల్గొన్న ఎస్ఐతో పాటు సిబ్బంది రాజాగౌడ్, గుణవంత్రావు, లక్ష్మయ్య, రాజేశ్, రవిలను మంచిర్యాల డీసీపీ ఉదయ్కుమార్, బెల్లంపల్లి ఏసీపీ రహమాన్, సీఐ ప్రమోద్రావు అభినందించారు.
గుంట్లపేటలో..
పెంచికల్పేట్, జూన్ 20 : మండలంలోని గుంట్లపేటలో ఆదివారం నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నట్లు కాగజ్నగర్ రూరల్ సీఐ రాజేంద్రప్రసాద్ తెలిపారు. పక్కా సమాచారం మేరకు గుంట్లపేటలొని దెబ్బెటి మహేశ్ ఇంటితో పాటు చేనులో సోదాలు చేసినట్లు పేర్కొన్నారు. చేనులో నకిలీ పత్తి విత్తనాలు సంచులు పాతిపెట్టగా వాటిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 45 కిలోల సంచులు రెండు లభించాయని, వాటి విలువ సుమారు రూ.1.80 లక్షలు ఉంటుందని వివరించారు. గత సంవత్సరం నుంచి నవీన్ అనే వ్యక్తి ద్వారా నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం కూడా విత్తనాలు అమ్మేందుకు తీసుకురాగా సోదాలు చేసినట్లు పేర్కొన్నారు. రెండు బ్యాగులను చేనులో పాతి పెట్టగా, మరో ఐదు బ్యాగులు సమీపంలో ఉన్న పెద్దవాగులో పారబోశాడని, వాటిని పరిశీలించామని వెల్లడించారు. సోదాల్లో పెంచికల్పేట్ ఎస్ఐ సీహెచ్ రమేశ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.